శ్రీరాంపూర్, డిసెంబర్ 28 : కార్మికుల పక్షాన పోరాడుతుందనే నమ్మకంతోనే వారంతా ఏఐటీయూసీకి పట్టం కట్టారని ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వీ సీతారామయ్య పేర్కొన్నారు. గురువారం శ్రీరాంపూర్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిప్యూటీ ప్రధాన కార్యదర్శి వీరభద్రయ్య, ముస్కె సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి బాజీసైదా, ఉపాధ్యక్షుడు కొట్టె కిషన్రావుతో కలిసి మాట్లాడారు. ఏఐటీయూసీని సింగరేణి గుర్తింపు సంఘంగా గెలిపించిన కార్మికులకు, ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన నాయకులు, యూనియన్ల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
నాలుగేళ్ల కాల పరిమితితోనే ప్రధాన కార్మిక సంఘాల అంగీకారంతో గుర్తింపు సంఘం ఎన్నికలకు వెళ్లామని, ఇది నిజంగా కార్మికుల విజయమేనని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో కార్మికుల హక్కుల సాధన కోసం, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. కొత్త గనులు సాధిస్తామని, ప్రైవేటీకరణను అడ్డుకుంటామని పేర్కొన్నారు. గుర్తింపు హోదా సాధించినందుకు సంతోషంగా ఉందని, ఇక నుంచి యూనియన్లతో సంబంధం లేకుండా కార్మికుల అభ్యున్నతికి కృషి చేస్తామన్నారు. కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతామన్నారు.
ఏఐటీయూసీ గెలుపుపై శ్రీరాంపూర్లోని గనులు, ఓసీపీలు, డిపార్ట్మెంటులపై నాయకులు, కార్మికులు, కార్యకర్తలు గురువారం సంబురాలు నిర్వహించారు. పటాకులు కాల్చి.. మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ బ్రాంచ్ సహాయ కార్యదర్శి కొంరయ్య, మైనింగ్ స్టాఫ్ ఇన్చార్జి రాజేశ్వర్రావు, పిట్ కార్యదర్శులు ఆకుల లక్షణ్, సారయ్య, నర్సింగారావు, నాయకులు ఫ్రోజ్ఖాన్, బాలకృష్ణ, గిజ్జ రమేశ్, సదానందం, భాస్కర్, సంపత్ పాల్గొన్నారు.