“రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎలాంటి అవినీతికి తావులేకుండా పకడ్బందీగా అమలు చేస్తాం. దళితబంధు యూనిట్లలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమిచ్చేలా అవగాహన కల్పిస్తున్నాం. పత్తి సాగు చేసే రైతులకు ఏమైనా ఇబ్బందులుంటే తప్పకుండా పరిష్కరిస్తాం. ఎవరైనా అర్హులు ఉండి పంఛన్ రాకపోతే వారికి న్యాయం చేస్తాం” అని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి పేర్కొన్నారు. మంచిర్యాల జడ్పీ సమావేశ మందిరంలో చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన జడ్పీ సర్వసభ్య సమావేశానికి ఆమె హాజరు కాగా, సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కాగా, ఆరున్నర గంటల పాటు వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
మంచిర్యాల, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రభుత్వ సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేస్తామని కలెక్టర్ భారతీ హోళికేరి స్పష్టం చేశారు. మంచిర్యాలలోని జడ్పీ సమావేశ మందిరంలో చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన జడ్పీ సర్వసభ్య సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు. గతంలో కోరం లేని కారణంగా రెండుసార్లు వాయిదా పడిన జడ్పీ సర్వసభ్య సమావేశానికి ఈసారి మెజారిటీ సభ్యులు హాజరయ్యారు. వైస్ చైర్మన్ సహా 13 మంది జడ్పీటీసీ సభ్యులు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కాగా, సాయంత్రం 5.30 గంటల దాకా కొనసాగింది. వ్యవసాయ శాఖతో మొదలుపెట్టి అన్ని ప్రభుత్వ శాఖల వారీగా అమలవుతున్న పథకాలు, కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు. మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు మాట్లాడుతూ.. దళితబంధు పథకం కింద పాడిపశువుల కొనుగోళ్లలో అధికారుల జోక్యం ఎక్కువైనట్లు తమ దృష్టికి వచ్చిందని, వారు చెప్పిన దగ్గరే పశువులు కొనుగోలు చేయాలని కొందరు అధికారులు బలవంతం చేసినట్లు తెలిసిందన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పారు. దీనికి కలెక్టర్ స్పందిస్తూ దళితబంధు, గొర్రెల పంపిణీలాంటి పథకాలు ఏవైనా పకడ్బందీగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పాడిపశువుల కొనుగోలుకు లబ్ధిదారుడు తనకు నచ్చిన రాష్ట్రం ఎంచుకోవచ్చన్నారు. పశువుల నాణ్యత, అధిక పాల ఉత్పత్తి, వాటి ఆరోగ్యంపై అధికారులు సలహాలు, సూచనలు మాత్రమే ఇస్తారన్నారు.
లబ్ధిదారుడి ఆర్థిక స్తోమత మెరుగుపరచడం, తక్కువ ధరలో మేలుజాతి పశువులను అందించే విషయంలో మాత్రం తాము వెనక్కి తగ్గమన్నారు. సమావేశానికి హాజరైన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పత్తి కొనుగోళ్లపై అడిగిన ప్రశ్నకు కలెక్టర్ సమాధానం ఇచ్చారు. వరిని రాష్ట్రప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, పత్తి మాత్రం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కొంటుందని చెప్పారు. సీసీఐ ఇచ్చే ధరకన్నా బహిరంగ మార్కెట్ ఎక్కువ ధర వస్తుందని చెప్పారు. పత్తి సాగు చేసిన రైతులకు ఇంకా ఏమైనా సమస్యలుంటే తప్పకుండా పరిష్కరిస్తామని చెప్పారు. దళితబంధు పథకంలో చాలా మంది యువకులు వాహనాల కొనుగోలుకే ప్రాధాన్యం ఇచ్చారని, అలా కాకుండా పాడిపశువులు, వ్యవసాయ యంత్ర పరికరాలు కొనుగోలు చేసి ఉంటే రిస్క్ తక్కువగా ఉండేదని, కొత్తగా మంజూరు చేసే యూనిట్లలోనైనా వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇచ్చేలా అధికారులు లబ్ధిదారుల్లో అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే చిన్నయ్య కోరారు. దీనికి కలెక్టర్ స్పందిస్తూ జిల్లాలో 330 దళితబంధు యూనిట్లు ఇస్తే, అందులో 85 శాతం మంది వాహనాలే కొనుగోలు చేశారన్నారు. కొందరు మాత్రం పాడిపశువులు కొన్నారన్నారు. ఈ విషయంలో లబ్ధిదారులను ప్రోత్సహించడానికి రీసోర్స్ కమిటీలు పని చేస్తున్నాయన్నారు. ఈ కమిటీలోని అధికారులు లబ్ధిదారులతో నిత్యం మాట్లాడుతూ.. వారికి సలహాలు, సూచనలు ఇస్తున్నారని చెప్పారు. పాడిపరిశ్రమను ప్రోత్సహిస్తే లక్షెట్టిపేటలో రూ.5 కోట్లతో నిర్మించిన విజయ డెయిరీ ప్లాంట్ను పూర్తిస్థాయి సామర్థ్యంలో ఉపయోగించుకోవచ్చన్నారు. ఆ దిశగా తాము ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.
రోజూ మూడు వేలకు పైగా లంపీస్కిన్ టీకాలు..
పశువులకు లంపీస్కిన్ వ్యాధి సోకిన తర్వాత టీకాలు వేస్తారా.. లేదా ముందే వేస్తారా అని సభ్యులు అడిగిన ప్రశ్నకు సంబంధిత శాఖ అధికారి సమాధానం ఇచ్చారు. రాక ముందే టీకాలు వేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో ఇప్పటి వరకు మంచిర్యాల జిల్లావ్యాప్తంగా 50 వేల డోసుల టీకాలు వేశామన్నారు. రోజుకు సగటున 3000 నుంచి 3500 టీకాలు వేస్తున్నామని చెప్పారు. దండేపల్లిలో ఇప్పటికే కొన్ని కేసులు నమోదైనట్లు స్థానిక జడ్పీటీసీ చెప్పగా వ్యాధి వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారి వివరణ ఇచ్చారు.
పింఛన్లు ఎందుకు వస్తలేవంటే..
చాలా మంది సభ్యులు అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వడం లేదంటూ సమావేశంలో ప్రశ్నలు లేవనెత్తారు. దీనికి సంబంధిత అధికారి, కలెక్టర్ పింఛన్లు రాకపోవడానికి గల కారణాలను కూలంకషంగా వివరించారు. జీవో 17, సాప్ట్వేర్ 360లో పొందుపరిచే డేటా ఆధారంగా పింఛన్లు రిజెక్ట్ అయ్యాయని చెప్పారు. ఎవరైనా అర్హులు ఉండి పింఛన్ రాకపోతే తప్పకుండా వారికి న్యాయం చేస్తామని చెప్పారు. ఉత్తమ గ్రామ పంచాయతీల జాతీయ అవార్డుల పోటీపై సభ్యులకు అధికారులు అవగాహన కల్పించారు. బతుకమ్మ చీరల పంపిణీ, మిషన్ భగీరథ పనులపై సుదీర్ఘంగా చర్చించారు. విద్య, వైద్యారోగ్య శాఖ, పంచాయతీరాజ్, అటవీ శాఖ, ఉద్యాన శాఖ, మత్స్యశాఖ, పౌరసరఫరాల శాఖ ఇలా 40కిపైగా శాఖల అధికారులు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సమావేశం జరిగింది. జడ్పీ సీఈవో నరేందర్, వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, కో ఆప్షన్ సభ్యులు నయీం పాషా, అక్బర్ మోహియొద్దీన్, 8 మంది ఎంపీపీలు, అన్ని ప్రభుత్వ శాఖల హెచ్వోడీలు సమావేశంలో పాల్గొన్నారు.