నల్లగొండ, ఆగస్టు 6 : డీఏపీ…ఉత్పత్తి బాగా పెరిగేందుకు రైతులు పంటలకు ఉపయోగించే ఎరువు. ప్రతి రైతు పంట సాగు చేసిన తర్వాత వినియోగించే ఈ ఎరువు కొందరి దోపిడీ మూలంగా మరింత ప్రియంగా మారింది. కాంప్లెక్స్ ఎరువులకు ధరలు పెరుగుతుండటంతో డీఏపీ వైపు మళ్లిన రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకోని ఎమ్మార్పీ రేట్లకు మించి అధిక ధరకు విక్రయిస్తున్నారు. ప్రధానంగా ఈ దందా హోల్ సేల్ డీలర్లు ఎక్కువగా ఉండే మిర్యాలగూడ కేంద్రంగా వ్యవసాయాధికారుల కనుసన్నల్లో జోరు గా నడుస్తోంది. కంపెనీ ధర బస్తా రూ.1350 ఉంటే వారు మరో రూ.300 పెంచి రిటైల్ డీలర్లకే రూ.1650లకు విక్రయిస్తుండగా రిటైల్ డీలర్ మరో వంద, రెండొందలు మార్జిన్తో విక్రయిస్తూ రైతులను దోచుకుంటున్నారు.
పంట వేసిన తర్వాత వేరు వ్యవస్థ అబివృద్ధి చెంది దిగుబడులు రావటానికి ఉపయోగించే ఎరువుల్లో డీఏపీకి ప్రత్యామ్నాయమైన కాంప్లెక్స్ ఎరువుల ధరలను ఆయా కంపెనీలు విపరీతంగా పెంచాయి. అయితే డీఏపీ కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్నందున సబ్సిడీ ఇస్తుండటంతో దాని ధర రూ.350గా ఉంది. అయితే హోల్ సేల్, రిటైల్ డీలర్లు డీఏపీని ఎమ్మార్పీ ధరకు మించి రూ.400 అదనంగా అమ్ముతున్నా కాంప్లెక్స్ ధరల కంటే తక్కువగా ఉన్నందున రైతులు మిన్నకుండా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కాం ప్లెక్స్ ధరల పెరుగుదలను చూసి, ఈ డీలర్లు ఎక్కువ ధరకు అమ్ముతున్నా వ్యవసాయాధికారులు పట్టించుకోవడంలేదు. మిర్యాలగూడ కేంద్రంగా జరిగే ఈ దందాకు అక్కడి అధికారుల కనుసన్నల్లో, నల్లగొండ వ్యవసాయాధికారుల సహకారంతో నడుస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి.
కాంప్లెక్స్ ఎరువుల ధరలను ఆయా కంపెనీలు ఇటీవల కాలంలో (50కేజీల బస్తా) విపరీతంగా పెంచాయి. ప్రధానంగా 14-35-14కు రూ.2450, 10-26-26, 12-32-16లకు రూ.2350, 28-28-0, 19-19-19లకు రూ.2300, 20-26-0-13కు 2150 చొప్పున ఆయా కంపెనీలు ధరలు పెంచాయి. వీటి ధరలు ఆయా కంపెనీల చేతుల్లో ఉండటంతో రా మెటీరియల్ ధరలు పెరిగాయనే సాకుతో విడతల వారీగా పెంచాయి. పంట ఎదుగుదలకు వినియోగించేది యూరియా అయితే వేరు వ్యవస్థ అభివృద్ధి చెంది పంటల దిగుబడి పెరిగేందుకు డీఏపీతో పాటు కాం ప్లెక్స్ ఎరువులు వాడుతారు.
ఈ ఎరువుల్లో యూరియాతో పాటు డీఏపీలు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నందున రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో సబ్సిడీలు ఇవ్వటంతో వీటి ధరలు పెద్దగా పెరగవు. ఒకవేళ కంపెనీలు పెంచినా కేంద్రమే సబ్సిడీ ఇస్తుంది. దీన్ని ఆసరాగా తీసుకున్న హోల్సేల్ డీలర్లు కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరిగినందున తప్పనిసరిగా ప్రత్యామ్నాయంగా ఉన్న డీఏపీనే కొంటారనే ఆలోచనతో హోల్సేల్ డీలర్లు బస్తాకు రూ. 300 అదనంగా అమ్మితే తీసుకెళ్లిన రిటైల్ డీలర్లు మరో వం ద పెంచి విక్రయిస్తూ రైతుల జేబులు ఖాళీ చేస్తున్నారు.
కేంద్రం రైతులకు తక్కువ ధరలో డీఏపీని అందచేయాలనే ఆలోచనతో సబ్సిడీ ఇస్తుంటే ఎమ్మార్పీ ధరకు రైతులకు ఇవ్వాల్సిన హోల్సేల్ డీలర్లు అధిక ధరలకు విక్రయిస్తున్న నేపథ్యంలో నియంత్రించాల్సిన వ్యవసాయాధికారులు వారి మోచేతి నీళ్లు తాగుతూ మిన్నకుండా ఉండటంతో వారి వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతున్నది. ప్రధానంగా ఇఫ్కో, గ్రోమోర్, నవరత్న లాంటి కంపెనీలకు సంబంధించిన డీఏపీ జిల్లాకు ఎక్కువగా వస్తుంది. వాటికి డీలర్షిప్ తీసుకున్న వారు ముందస్తుగా (డిపాజిట్ చెల్లించి పీడీ లేదా లైసెన్స్) ఆర్డర్ నమోదు చేసుకుంటే ఆయా కంపెనీలు డీఏపీని సరఫరా చేస్తాయి.
వారు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న రిటైల్ డీలర్లకు సరఫరా చేస్తారు. అయితే ఈ వ్యవహారంలో రూ.1350 ఎమ్మార్పీ ఉన్న డీఏపీ మిర్యాలగూడ నుంచి రిటైల్ డీలర్ల వద్దకు చేరే సరికి రూ.1650, ఆ తర్వాత అదే బస్తా రైతుల వద్దకు చేరేసరికి మరో రూ.100 వరకు పెరుగుతోంది. ప్రస్తుతం జిల్లాలో 2.02 లక్షల ఎకరాల్లో వరి, 5.93లక్షల ఎకరాల్లో పత్తి సాగు కావటంతో డీఏపీ కోసం రైతులు దుకాణాల వద్దకు వెళ్తే అక్కడ ఉన్న ధరలను చూసి అవాక్కవుతున్నారు. అయితే కాంప్లెక్స్ ఎరువుల కంటే తక్కవ ధరే కదా అనే ఆలోచనతో కొంటున్నారట.
డీఏపీ బస్తా ధర ప్రస్తుతం రూ.1350 ఉన్నది. ఇదే ధరకు రైతులకు అమ్మాల్సి ఉంది. ఎవరైనా ఎక్కువ ధరకు అమ్మితే వారిపై చర్యలు తీసుకుంటాం. అయితే హోల్ సేల్ డీలర్లు బస్తాపై రూ.300 పెంచి రిటైలర్లకు అమ్ముతున్నారనే విషయం నా దృష్టికి రాలేదు. దీనిపై స్థానిక వ్యవసాయ శాఖ అధికారుల నుంచి సమాచారం తీసుకొని, విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
-డీఏవో, వినోద్ కుమార్, నల్లగొండ