నిర్మల్, డిసెంబర్ 23(నమస్తే తెలంగాణ): తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే పంటలను సాగు చేయాలని జిల్లా వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు రైతులకు చేస్తున్న సూచనలు సత్ఫలితాలిస్తున్నాయి. రైతువేదికల్లో తరుచూ సమావేశాలు నిర్వహిస్తున్న వ్యవసాయాధికారులు పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అధికారుల సూచనలు పాటిస్తున్న జిల్లా రైతులు.. ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధర కంటే బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధర ఉన్న మక్క సాగుకే మొగ్గు చూపుతున్నారు. రాష్ట్ర ప్రభు త్వం క్వింటాలుకు రూ.2090 మద్దతు ధరను అందిస్తున్నది. అయితే గత రెండు మూడేళ్లుగా మొక్కజొన్నకు డిమాండ్ పెరగడంతో ప్రైవేటు వ్యాపారులు క్వింటాలుకు రూ.2200 నుంచి 2300 వరకు చెల్లించి కొంటున్నారు. దీంతో రైతులు వరికి ప్రత్యామ్నాయంగా పెద్ద ఎత్తున మొక్కజొన్న సాగు చేస్తున్నారు. గతేడాది యాసంగిలో జిల్లా వ్యాప్తంగా 72 వేల ఎకరాల్లో మక్కను సాగు చేయగా ఈ సారి ఇప్పటికే 85 వేల ఎకరాల్లో మక్క పంట వేసినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా నిర్మల్ నియోజకవర్గంలోని లక్ష్మణచాంద, మామడ, సోన్, నిర్మల్, సారంగాపూర్, దిలావర్పూర్, నర్సాపూర్(జి) మండలాలతో పాటు ముథోల్ నియోజకవర్గంలోని లోకేశ్వరం, భైంసా, కుంటాల మండలాల రైతులు అధికంగా మక్క సాగు చేస్తున్నారు. కాగా మిగతా పంటలైన శనగ 60వేల ఎకరాలు, వరి 75 వేల ఎకరాలు, 20-30 వేల ఎకరాల్లో నువ్వు, సన్ఫ్లవర్, వేరుశనగ తదితర పంటలు సాగయ్యే అవకాశం ఉన్నదని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు.
అధిక లాభాలే కారణం
కాగా వరి పంట మాదిరిగా మక్కకు సాగు నీటిని అధికంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. పెట్టుబడి ఖర్చులు కూడా తక్కువే. ఆరుతడి పంట కావడంతో లాభాలు కచ్చితంగా వస్తాయని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వరితో పాటు పసుపు ఇతర వాణిజ్య పంటలకు పెట్టుబడి ఖర్చులు తడిసి మోపెడవుంతుండడంతో పాటు తెగుళ్లు సోకుతుండడం వల్ల దిగుబడులపై తీవ్ర ప్రభావం పడుతున్నది. అంతే కాకుండా మక్క పంట సాగులో పర్యవేక్షణ కూడా పెద్దగా అవసరం లేకపోవడంతో రైతులు మొగ్గు చూపుతున్నారు. అలాగే పండిన పంటకు బహిరంగ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడం వంటివి రైతులను మక్కసాగు వైపు మళ్లిస్తున్నాయి. కాగా ఈ నెలాఖరు వరకు మాత్రమే మొక్కజొన్న సాగుకు అనుకూల సమయమని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
పెట్టుబడి ఖర్చులు తక్కువ…
నాకున్న 10ఎకరాల్లో ఎనిమిదెకరాలు మొక్కజొన్న వేశాను.మిగతా రెండెకరాల్లో కూరగాయ పంటలువేశాను. వరి, ఇతర పంటలసాగుతో పోలిస్తే మక్కసాగుకు పెట్టుబడి ఖర్చులుతక్కువ. ఎకరానికి రూ.15వేల నుంచి రూ. 20వేలుమాత్రమే ఖర్చవుతుంది. అన్నీ అనుకూలిస్తే పంటదిగుబడి ఎకరానికి 40 క్వింటాళ్ల నుంచి 45 క్వింటాళ్లవరకు వస్తుంది. ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర తక్కువగాఉన్నప్పటికీ, బహిరంగ మార్కెట్లో మంచి డిమాండ్ఉండడం వల్ల పంటను అమ్ముకోవడానికి కూడా ఏబాధ లేదు.
-శ్రీనివాస్ రెడ్డి, మక్క రైతు (సిద్ధులకుంట)
వరికి ప్రత్యామ్నాయంగా మక్క సాగు.
.రైతులు సంప్రదాయబద్ధంగా కొనసాగుతున్నవ్యవసాయానికి భిన్నంగాపంటలు వేస్తున్నారు.మార్కెట్లో డిమాండ్ ఉన్నపంటలను సాగు చేయాలని ఎప్పటికప్పుడు రైతులను చైతన్య పరుస్తున్నాం. ఈకారణంగానే వరికి బదులు మొక్కజొన్న సాగుకు జిల్లా రైతులు పెద్ద ఎత్తునముందుకు వచ్చారు. మక్క సాగులో తక్కువ పెట్టుబడి ఖర్చులతో అధిక లాభాలు పొందే అవకాశం ఉంది.
ఎకరాకు పెట్టుబడి ఖర్చులు పోను రూ. 60 వేల నుంచిరూ. 70 వేల ఆదాయం వస్తుంది.
-అంజి ప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి (నిర్మల్)