కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/కెరమెరి, జనవరి 23 : ప్రకృతినే దైవంగా కొలిచే ఆదివాసీలు వారి ఆచారాలు సంస్కృతీ సంప్రదాయాలను కొండకోనల్లోనే నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. సహ్యా ద్రి పర్వతాల్లోని తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న గుహల్లో శార్ధూల వాహిని జం గు బాయి కొలువై ఉంది. తెలంగాణతో పాటు ఏపీ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల నుంచి గోండు, పర్ధాన్, కొలాం తెగలకు చెంది న ఆదివాసీలు యేటా పుష్యమాసంలో ఇక్కడికి వేలాదిగా తరలివస్తారు. గురువారం (ఈనెల 25) నుంచి జరిగే పూజలతో ఇక్కడ వేడుకలు ప్రారంభం కానుండగా, నెల రోజుల పాటు కొనసాగనున్నాయి.
ఆదివాసీల ఆరాధ్యదైవంగా..
ఆరాధ్యదైవం జంగుబాయిని నియమనిష్ఠలతో కొలిస్తే అంత శుభమే చేస్తుందని గిరిజనుల నమ్మకం. కెరమెరి మండల కేంద్రానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న పరందోలి పంచాయతీ మహరాజ్గూడ అటవీ ప్రాంతంలోని గుహల్లో జంగుబాయి కొలువై ఉంది. కొండకు ఆనుకొని ప్రవహిస్తున్న వాగులో భక్తులు పుణ్యస్నానాలు చేసి జంగుబాయికి మొక్కులు తీర్చుకుంటారు. ఏడాదికి ఒకసారి జరిగే జాతర సమయంలో నిత్యం వేలాది మంది తరలివస్తారు.
పుష్యమాసం ఎంతో పవిత్రం
ఆదివాసీలకు పుష్యమాసం ఎంతో పవిత్రమైం ది. ఈ మాసంలోనే గిరిజనులంతా తమ ఆరా ధ్య దేవుళ్లను నిష్ఠతో కొలుస్తారు. పుష్యమాసం నెలవంక కనిపించిన రోజు నుంచి అమావాస్య వరకు పవిత్రమైన రోజులుగా భావిస్తారు. పాదరక్షలు ధరించరు. మద్యపానానికి దూరంగా ఉంటారు. నేలపైనే నిద్రిస్తారు. అత్యంత నిష్టతో పూజలు కొనసాగిస్తారు.
ప్రత్యేక పూజా విధానం..
ఆదివాసీలు తమ దేవుళ్లకు పూజలు చేసేందుకు ఇతర కులాల వారికి అనుమతినివ్వరు. వారిలోనే కొంతమంది పూజాలుగా వ్యవహరిస్తారు. తమ పంటలతోనే దేవుళ్లకు నైవేద్యాన్ని సమర్పిస్తారు. వడ్లను ఇంటి వద్దనే రోళ్లలో దంచి సేకరించిన బియ్యాన్ని పూజలో వాడుకుంటారు. నైవేద్యం కోసం గోధుమ పిండి, పప్పు, బెల్లం అవసరం. పురాతన పద్ధతుల్లో తీసిన నువ్వుల నూనెనే వాడతారు. దీపారాధన కోసం నెయ్యి లేదా నువ్వుల నూనే, ఆముదం నూనెను మాత్రమే వాడుతారు. పూజా సామగ్రితో కాలినడకన జంగుబాయి వద్దకు చేరుకుంటారు. రాత్రిపూట దీపారాధన చేసి ప్రత్యేక నైవేద్యం సమర్పిస్తారు. పుణ్యక్షేత్రం వద్ద తుమ్రం, కొడప, సలాం, రాయిసిడాం, వెట్టి, మరప, హెర్రెకుమ్ర, మందాడి (8) గోత్రాల కటోడాలు(పూజారులు) పూజలు చేస్తారు. డోలు, సన్నాయి వాయిద్యాల మధ్య దీపారాధన చేస్తారు. అక్కడి నుంచి మైసమ్మ, పోచమ్మ, రావుడ్క్ వద్ద మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం సహపంక్తి భోజనం చేసి దేవుడి పాటలు పాడుతూ అమ్మవారిని ఆరాధిస్తారు. మరుసటి ఉదయం సంప్రదాయ వాయిద్యాల మధ్య నృత్యాలు చేస్తూ సంబురాలు చేసుకుంటారు. ఇలా నెల రోజుల పాటు ఇలాగే పూజలు కొనసాగుతాయి.