ఎదులాపురం, ఫిబ్రవరి1: అందరి సహకారంతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలపాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో రాహుల్ రాజ్ కలెక్టర్గా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు ,జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, కలెక్టరేట్ సిబ్బంది పూలు మొక్కలు ,పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. 2021లో రెండు నెలల పాటు ఇన్చార్జి కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించినట్లు గుర్తు చేసుకున్నారు. మాతాశిశు మరణాలను తగ్గించేలా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో కూడా సమష్టి కృషితో జీరో స్థాయికి తీసుకురావాలన్నారు. గిరిజన జిల్లాలో పనిచేయడం సంతృప్తి కరంగా ఉంటుందని, మరో గిరిజన ఆదిలాబాద్ జిల్లాలో పనిచేయడానికి అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి శాఖల సమన్వయం అవసరమని, ప్రజా సంక్షేమ కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని కోరారు. త్వరలో శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తానని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఎన్ నటరాజ్, రిజ్వాన్ బాషా షేక్, డీఎఫ్వో రాజశేఖర్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ పీ శ్రీజ, ఆర్డీవోలు రమేశ్ రాథోడ్, కదం సురేశ్, కలెక్టరేట్ పరిపాలనాధికారి అరవింద్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, కలెక్టరేట్ సిబ్బంది ఉన్నారు.