ఆదిలాబాద్ రూరల్, జూలై 2: కుల మతాలకు అతీతంగా పీరీల పండుగ వైభవంగా జరుపుకుంటామని, సవారీ బంగ్లా నిర్మాణానికి తనవంతు సహకారం అందిస్తానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం చాందా(టీ) గ్రామంలో సవారీ బంగ్లా నిర్మాణానికి భూమి పూజ చేశారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు బ్యాండ్మేళాల నడుమ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సవారీ బంగ్లా వద్ద సౌకర్యాలు కల్పించేలా తనవంతుగా కృషి చేస్తానని తెలిపారు. మొహర్రం లోపు ఇక్కడ షెడ్డు నిర్మాణం అయ్యేలా చూస్తానని భరోసా ఇచ్చారు. అదేవిధంగా గ్రామంలో డబుల్ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ సంవత్సరం చెక్డ్యాం పనులను ప్రారంభించి దసరా, దీపావళి వరకు పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్చైర్మన్ జహీర్ రంజానీ, ఎంపీపీ గండ్రత్ రమేశ్, దేవస్థానం నిర్వాహకులు శ్రీనివాస్, రాజేశ్, శివకుమార్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిక్కాల దత్తు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రమేశ్, దుర్గం ట్రస్ట్ చైర్మన్ శేఖర్, నాయకులు పాల్గొన్నారు.
రూ.6కోట్లతో సవారీ బంగ్లా షెడ్ల నిర్మాణం
ఎదులాపురం, జూలై 2 : ఐకమత్యాన్ని చాటి చెప్పే పండుగల్లో మొహర్రం ఎంతో విశిష్టత కలిగి ఉందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. బొక్కలగూడలోని బడే సాహజరత్, బడే నాల్సబ్ బంగ్లాలో 25వ వార్షికోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్యే జోగు రామన్న హాజరై నిర్వాహకులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం వారు పలు సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించగా సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం నియోజకవర్గంలో రూ.6కోట్లతో సవారీ బంగ్లా షెడ్ల నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. మత సామరస్యానికి బీఆర్ఎస్ పెద్దపీట వేస్తున్నదని చెప్పారు. అన్ని కులాలు మతాలకు సంబంధించిన ఆలయాలు, ప్రార్థన మందిరాలు నిర్మిస్తూ ఆధ్మాత్మిక భావాలు పెంపొందించేందకు ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. శాంతి స్థాపనకు బాటలు వేస్తూ ముందుకు పోతున్నామన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, దుర్గం ట్రస్ట్ చైర్మన్ శేఖర్, నాయకులు సాజిద్ ఉద్దీన్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షురాలు స్వరూపారాణి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.