భైంసాటౌన్, ఫిబ్రవరి 2 : మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఈ నెల 5వ తేదీన జరిగే బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ పరిశీలనకు వెళ్తున్న ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, దేగాం గ్రామంలోని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జోగు రామన్నను విఠల్ రెడ్డి పూలమాల, శాలువాతో సత్కరించారు.
ఎమ్మెల్యేకు సన్మానం..
భైంసా పట్టణంలోని కిసాన్గల్లికి చెందిన రైతులు ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టణంలోని బొర్ర గణేశ్ నుంచి బాబుల్గాం గ్రామం వరకు రోడ్డు సౌకర్యం కల్పించడంతో ఇబ్బందులు తీరాయన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ..
మండలంలోని దేగాం గ్రామంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను విఠల్ రెడ్డి అందజేశారు. భైంసా పట్టణానికి చెందిన బాజీరావుకు రూ.32 వేలు, లక్ష్మీబాయికి రూ.27 వేలు మంజూరయ్యాయి. నిరుపేద కుటుంబాలకు చెందిన వీరు అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చుల కోసం సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకున్నారు. మంజూరైన చెక్కులను వారికి అందించారు.
వీఆర్ఏల వినతి..
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డివిజన్లోని వీఆర్ఏలు ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి వినతి పత్రం అందించారు. సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించిన పే స్కేల్, అర్హులైన వీఆర్ఏలకు ఉద్యోగోన్నతులు, 55 ఏండ్లు నిండిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోర్వ చిన్నన్న, కుంట కాశీనాథ్, మారుతిపటేల్, ఏఎన్ఎం రాజకల, ఎన్ఎంలు, వీఆర్ఏలు తదితరులు ఉన్నారు.