టీఆర్ఎస్(బీఆర్ఎస్) ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తాయి. బీజేపీ అగ్రనాయకులు తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపర్చే కుట్రలపై గులాబీ శ్రేణులు భగ్గుమన్నాయి. నాడు ఆంధ్రాబాబు చంద్రబాబు మాదిరిగానే.. నేడు కమలనాథుల బరితెగింపుపై నిరసనలు మిన్నంటాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా గురువారం గులాబీ శ్రేణులు కేంద్ర ప్రభుత్వ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిష్టిబొమ్మలు దహనం చేశారు. శవయాత్రలు, రాస్తారోకోలు, ధర్నాలతో హోరెత్తించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను బీజేపీ కూల్చాలని చూడడం విడ్డూరంగా ఉందన్నారు. మఠాధిపతులు, స్వామిజీలను బీజేపీ నాయకులు వాడుకోవడం దారుణమన్నారు.
ఆదిలాబాద్లోని కలెక్టర్ చౌక్లో బీజేపీ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న టీఆర్ఎస్(బీఆర్ఎస్) శ్రేణులు
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న జిల్లా అధ్యక్షుడు కోనప్ప, జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నాయకులు
ఆదిలాబాద్/నిర్మల్, అక్టోబర్ 27(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ పట్టణంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ చౌక్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. తాంసిలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ, నేరడిగొండలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు. బేల మండలంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మనోహర్ ఆధ్వర్యంలో బీజేపీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించిన ఆందోళనలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లాలో..
నిర్మల్ జిల్లా కేంద్రంలోని జయశంకర్ చౌరస్తాలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి, బీజేపీ దిష్టిబొమ్మ దహనం చేశారు. భైంసా పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఎదురుగా మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ, పార్టీ పట్టణాధ్యక్షుడు ఫారూఖ్ అహ్మద్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు బీజేపీ కుట్రకు వ్యతిరేకంగా నిరసనకు దిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షాల దిష్టిబొమ్మలు దహనం చేశారు. బాసరలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ శ్యాం, సర్పంచ్ లక్ష్మణ్రావ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రైల్వేస్టేషన్ సమీపంలోని శివాజీ చౌక్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. కుంటాల మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ దత్తు ఆధ్వర్యంలో బస్టాండ్ ఎదుట బీజేపీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలోని తెలంగాణ తల్లి చౌరస్తాలో బీజేపీ దిష్టిబొమ్మ దహనం చేశారు. పార్టీ పట్టణాధ్యక్షుడు సురేశ్, మున్సిపల్ చైర్మన్ రాజేందర్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో టీఆర్ఎస్(బీఆర్ఎస్) ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
మంచిర్యాల (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ఆసిఫాబాద్, అక్టోబర్ 27 : టీఆర్ఎస్(బీఆర్ఎస్) ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ చేసిన కుట్రపై జిల్లా ప్రజానీకం భగ్గుమన్నది. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా శ్రేణులు, ప్రజలు నిరసనలు చేపట్టారు. డౌన్.. డౌన్.. బీజేపీ అంటూ నినాదాలు చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య ఆధ్వర్యంలో బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గ కేంద్రాలు, హజీపూర్, జన్నారం, దండేపల్లి, రామకృష్ణాపూర్, కోటపల్లి, బీమారం, తాండూరు, మందమర్రిలో బీజేపీ శవయాత్రలు నిర్వహించి, దిష్టిబొమ్మలు దహనం చేశారు. చెన్నూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు బీజేపీ, ప్రధాని మోదీ దిష్టిబొమ్మతో శవ యాత్ర నిర్వహించారు. అనంతరం బస్టాండ్ ఎదుట దిష్టిబొమ్మను దహనం చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తుల సమ్మయ్య, మున్సిపల్ చైర్పర్సన్ అర్చనాగిల్డా, కౌన్సిలర్లు ఉన్నారు. కోటపల్లి మండలకేంద్రంలో మాజీ ఎమ్మెల్యే పురాణం సతీశ్కుమార్ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ, బీజేపీ పార్టీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. తెలంగాణలో శాంతియుతంగా సాగుతున్న పాలనకు విఘాతం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. పచ్చబడ్డ తెలంగాణను చూసి ఓర్వలేక బీజేపీ చేస్తున్న కుట్రలకు ఎట్టిపరిస్థితుల్లో లొంగేది లేదని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని పరాయి వాడికి తాకట్టు పెట్టేది లేదని స్పష్టం చేశారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ సమీపంలో బీఆర్ఎస్(టీఆర్ఎస్) పార్టీ జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్ప, జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి,ఎమ్మెల్యే ఆత్రం సక్కు,పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి అరిగెల నాగేశ్వర్రావుతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. వారు మాట్లాడుతూ బీజేపీ చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, ఇకనైనా బీజేపీ, నరేంద్రమోదీ, అమిత్షాల ఎత్తుగడలు తెలంగాణలో చెల్లవని గుర్తుంచుకోవాలన్నారు. జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణరావు, ఎంపీపీ మల్లికార్జున్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ గాదవేణి మల్లేశ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవరావు ఉన్నారు. కాగజ్నగర్ పట్టణంలోని రాజీవ్గాంధీ చౌరస్తాలో నాయకులు, ప్రజలు ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
మంచిర్యాల టౌన్ : జిల్లా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకులు
మఠాధిపతులతో రాజకీయాలు దారుణం..
మా పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ నాయకులు మఠాధిపతులు, స్వామిజీలను వాడుకోవడం దారుణం. అధికారదాహంతో ఇంత దిగజారుడు రాజకీయాలు చేయడం బీజేపీకే చెల్లుతుంది. మఠాలు, పీఠాలు.. వాటి అధిపతులు అంటే సమాజంలో గౌరవం ఉంది. అలాంటి వారిని ఇటువంటి ప్రలోభాలు చేయడానికి వాడుకోవడం శోచనీయం. కమలనాథులు ఎన్ని కుట్రలు పన్నినా మమ్మల్ని ఏమి చేయలేరు.
– మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి
బీజేపీకి ప్రజల మనసు గెలిచే దమ్ములేదు
తెలంగాణలోని ప్రజల మనసు గెలిచే దమ్ములేని దద్దమ్మ పార్టీ బీజేపీ. అందుకే సిగ్గులేకుండా రాజ్యాంగ వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా మా ఎమ్మెల్యేలను కొనాలని చూసింది. తెలంగాణ సమాజం అమ్ముడుపోయేది కాదు. గతంలో ఎన్నో రాష్ర్టాల్లో ప్రభుత్వాలను పడగొట్టిన బీజేపీ పెద్దలు, తెలంగాణలోనూ అదే తరహా కుట్ర చేయాలని చూశారు. రాష్ర్టానికి ఒక్క మంచి పని చేయకపోగా, విధ్వంసం సృష్టించాలనుకోవడం దుర్మార్గం.
– విప్ సుమన్
బీజేపీకి ప్రజలే బుద్ధి చెబుతారు..
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టాలని చూసిన బీజేపీకి మునుగోడు ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. మునుగోడు నుంచే బీజేపీ పతనం ప్రారంభమవుతుంది. కమలం పార్టీ డబ్బులతో రాజకీయాలు చేయాలని చూస్తున్నది. అది తెలంగాణలో నడవదు. ప్రభుత్వాలను కూల్చడం, అధికారం చేపట్టడం బీజేపీకి అలవాటుగా మారింది. ప్రజాస్వామ్యంలో ప్రజలు అన్ని గమనిస్తున్నరు. రాబోయే రోజుల్లో బీజేపీ నామ రూపాల్లేకుండా అవుతుంది.
– అజ్మీరా రేఖానాయక్, ఎమ్మెల్యే, ఖానాపూర్
మోదీ, అమిత్ షా లు గద్దె దిగాలి..
మంచిర్యాలటౌన్, అక్టోబర్ 27: ఎమ్మెల్యేలకు డబ్బు ఎర చూపి కొనాలని చూడడం దుర్మార్గమైన చర్య. ఇలాగే డబ్బులు పెట్టి అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చారు. ప్రజాబలం లేని వారే ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడుతారు అనడానికి ఇది నిదర్శనం. ఇప్పటికే చాలా చోట్ల స్థానిక ఎన్నికల్లో బీజేపీకి చుక్కెదురయ్యింది. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు రూ. 400 కోట్లు ఇచ్చేందుకు బేరసారాలు చేశారు. ఇందుకు పలువురు స్వాములు రంగంలోకి దిగడం శోచనీయం. ఈ నెల 31న జరిగే అమిత్షా సభలో ఈ నలుగురు ఎమ్మెల్యేలను చేర్చాలని పన్నాగం పన్నారు. కానీ తెలంగాణ గడ్డపై పుట్టి, ఇక్కడి ప్రజల ఓట్లతో గెలిచి, ఉద్యమ వీరుడు కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తున్న వారు బీజేపీ కుయుక్తులను లోకానికి తెలియజేశారు. దేశంలో రాజకీయ సంక్షోభాలకు కారణమవుతున్న ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్షాలు వెంటనే గద్దెదిగాలి. మునుగోడు ఉప ఎన్నిక వారికి గుణపాఠం చెబుతుంది. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్న బీజేపీకి ప్రజలే బుద్ధి చెబుతారు.
– నడిపెల్లి దివాకర్రావు, మంచిర్యాల ఎమ్మెల్యే
మా నలుగురు ఎమ్మెల్యేలు హీరోలు..
ఆసిఫాబాద్, అక్టోబర్ 27 : బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములవుతున్న ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని బీజేపీ కుట్రలు చేసింది. మా ఎమ్మెల్యేలు ఎంతో చాకచక్యంగా వ్యవహరించారు. కోట్లాది రూపాయలు ఎరజూపి ప్రజాస్వామ్యన్ని ఖూనీ చేయాలని చూడడం దుర్మార్గపు చర్య. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుస్తుందని వచ్చిన సర్వేలను చూసి పీఎం నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా పన్నిన పన్నాగమే ఇది. బీజేపీ చర్యలను ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. తెలంగాణలో మా నలుగురు ఎమ్మెల్యేలు హీరోలుగా నిలిచారు.
– ఆత్రం సక్కు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే
దేశవ్యాప్త ఆదరణ చూడలేకే నీచ రాజకీయాలు
బెల్లంపల్లి, అక్టోబర్ 27 : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు దేశ వ్యాప్తంగా వస్తున్న విశేష ఆదరణ చూడలేక బీజేపీ నీచరాజకీయాలకు పాల్పడుతోంది. ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎప్పుడు కూడా అమ్ముడు పోరు. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో ప్రభుత్వాలను కూలదోయడానికి బీజేపీ చేస్తున్న ఎత్తుగడలను మునుగోడు ఉప ఎన్నికలే తిప్పికొడుతాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లొంగిపోరు. కేసీఆర్ సాదాసీదా రాజకీయ నాయకుడు కాదు. రాజకీయ చతురత కలిగిన ఆయనను ఢీకొనడం ఎవరి తరం కాదు. బీఆర్ఎస్ పార్టీతో జాతీయ రాజకీయాల్లోకి వస్తే తమకు రాజకీయ మనుగుడ ఉండదనే అక్కసుతోనే బీజేపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోంది. 67 ఏండ్లలో పరిష్కారంకాని ఎన్నో సమస్యలను ఈ ఎనిమిదేండ్లలో సీఎం కేసీఆర్ పరిష్కరించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపు సాధించి, అదే స్ఫూర్తితో దేశ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పడం ఖాయం.
– దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్యే, బెల్లంపల్లి
బీజేపీకి పుట్టగతులుండవు
ఆసిఫాబాద్, అక్టోబర్ 27 : బీజేపీ రాజకీయంగా టీ(బీ)ఆర్ఎస్ను ఎదుర్కోనలేక నీచరాజకీయాలు చేస్తున్నది. కేవలం ఉప ఎన్నికల్లో గెలిచేందుకు ఏకంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలన్న ఆలోచన సరైనది కాదు. తెలంగాణలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ చేసిన ప్రయాత్నాన్ని విఫలం చేయడంలో మా నలుగురు ఎమ్మెల్యేలు చాకచక్యంగా వ్యవహరించారు. ఇంతజరిగినా బీజేపీ నాయకులు తెలంగాణ ఎమ్మెల్యేలే నాటకం ఆడారంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ నాయకులను ప్రజలు నమ్మేపరిస్థితి లేదు. ఎన్ని నాటకాలు వేసినా ఇక్కడ లాభం లేదు. తెలంగాణలో బీజేపీకి పుట్టగతులుండవు.
– కోనేరు కోనప్ప, టీఆర్ఎస్(బీఆర్ఎస్) కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు, సిర్పూర్ ఎమ్మెల్యే
హీనమైన చర్య..
ప్రజాస్వామ్య దేశంలో ఎమ్మెల్యేలను కొనడం, ప్రభుత్వాలను పడగొట్టడం బీజేపీ మాత్రమే చేస్తున్నది. సాధు, సంతులను ఉపయోగించి, వారి ద్వారా ఇటువంటి పనులు చేయించడం హీనమైన చర్య. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇటువంటి ప్రలోభాలకు లొంగరు. తమపై జరుగుతున్న కుట్రను తిప్పికొట్టడం మంచి పరిణామం. భవిష్యత్తులో కూడా బీజేపీ కుట్రలు తెలంగాణలో సాగవు. ఇంతక ముందు కూడా రేవంత్రెడ్డిని ఉపయోగించుకొని చంద్రబాబు భంగపడ్డారు. తెలంగాణలో కనుమరుగయ్యాడు. ఇదే గతి బీజేపీ అగ్రనాయకత్వానికి పడుతుందని గమనించాలి.
– జీ.విఠల్రెడ్డి, ఎమ్మెల్యే, ముథోల్