మంచిర్యాల ప్రతినిధి/ఆదిలాబాద్, జూలై 25(నమస్తే తెలంగాణ) ;“సమైక్య పాలనలో దశాబ్దాలుగా వెట్టి చాకిరీ చేసినం. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ మా సేవలను గుర్తించి మా కల నెరవేర్చిండు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం వీఆర్ఏలందరినీ హైదరాబాద్కు పిలిపించుకున్నడు.ఈ బతుకులు మీ కొద్దు. కచ్చితంగా రెగ్యూలర్ చేస్త అని మాట ఇచ్చిండు. అప్పటి దాక రూ.6 వేలు ఉన్న గౌరవ వేతనాన్ని రూ.10,500కు పెంచిండు. ఇచ్చిన మాట ప్రకారం క్రమబద్ధీకరించిండు. కేసీఆర్ మాట ఇచ్చిండంటే అది కచ్చితంగా నెరవేరుతుంది. మాతోపాటు మా పిల్లల జీవితాలు బాగు పడుతయి.’ అని వీఆర్ఏల మంచిర్యాల జిల్లా జేఏసీ కో-కన్వీనర్ జనార్దన్, వీఆర్ఏల సంఘం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు నారాయణ, వీఆర్ఏల సంఘం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు గంగన్న ‘నమస్తే’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు.
‘మండల రెవెన్యూ ఆఫీసులో పనంటే ముందు గుర్తుకొచ్చేది వీఆర్ఏ(విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు)లు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు కావాలన్నా.. భూములు సర్వే చేయాలన్నా.. ప్రభుత్వ భూములకు ప్రొటెక్ట్ చేయాలన్నా.. ఏదైనా నోటీసు సర్వ్ చేయాలన్నా వీఆర్ఏలే చేస్తారు. ఉదయం నుంచి రాత్రి వరకు చాకిరీ చేసినా కేవలం పార్ట్ టైం ఉద్యోగులుగానే చూసేవారు. నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని సమాఖ్య పాలనలో విన్నవించినా పట్టించుకున్న పాపాన పోలేదు. అట్లాంటిది తెలంగాణ వచ్చిన వెంటనే 2015లో సీఎం కేసీఆర్ వీఆర్ఏలు అందరినీ హైదరాబాద్ పిలిపించుకున్నడు. ఈ బతుకులు మీకు వొద్దు. కచ్చితంగా రెగ్యులర్ చేస్తామని మాట ఇచ్చిండు. అప్పటి దాకా రూ.6 వేలు ఉన్న గౌరవ వేతనాన్ని రూ.10,500కు పెంచిండు. అప్పుడెప్పుడో ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ రోజు రెగ్యులరైజ్ చేసిండు. కేసీఆర్ నోట్లో నుంచి మాట వచ్చిందంటే అది కచ్చితంగా నెరవేరుతుంది.’ అని మంచిర్యాల జిల్లా వీఆర్ఏల జేఏసీ కో-కన్వీనర్ జనార్దన్ తెలిపారు. వీఆర్ఏలను రాష్ట్ర ప్రభుత్వం క్రమబద్ధీకరించిన నేపథ్యంలో ఆయన మంగళవారం ‘నమస్తే తెలంగాణ’కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
నమస్తే : రెగ్యులరైజ్ కావడంపై మీ స్పందన?
జనార్దన్ : చాలా సంతోషంగా ఉంది. నా కంటే ముందు మా నాన్న, తాతలు దాదాపు ఐదు తరాలు వీఆర్ఏలుగానే పని చేశారు. నాన్న అనంతరం ఉద్యోగం నాకు వచ్చింది. నేను పీజీ చదువుకున్నా. అంత చదువుకున్నది ఈ పని చేయడానికేనా అనిపిచ్చేది. కానీ.. వీఆర్ఏలను ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్గా గుర్తించాలనే డిమాండ్ ఉంది. అది నెరవేరుతోందన్న ఆశతో ప్రైవేటులో ఉద్యోగాలు వచ్చినా వదులుకొని ఇందులోనే పని చేస్తున్నా. నా నమ్మకం ఈ రోజు ఫలించింది. నేను పీజీ చేసినందుకు ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ కాబోతున్న. దీనికి ముఖ్య కారణం ముఖ్యమంత్రి కేసీఆర్. నాతోపాటు నా కుటుంబానికి ప్రభుత్వం బంగారు భవిష్యత్ను ప్రసాదించింది.
నమస్తే : వీఆర్ఏగా పనిచేసినప్పటి జీతం సరిపోయేదా?
జనార్దన్ : వీఆర్ఏల జీతం చాలా తక్కువ. మా నాన్న రూ.500లకు చేశాడు. 2015కు ముందు రూ.6వేల గౌరవ వేతనం వచ్చేది.ఆ డబ్బులతో కుటుంబం గడవడం కష్టంగా ఉండేది. ఆ తరువాత కేసీఆర్ తెలంగాణ ఇంక్రిమెంట్ కలిపి రూ.10,500 ఇచ్చారు. టీఏ, డీఏ అన్ని కలిపి రూ.11,400 వచ్చేవి. ఇప్పుడు రెగ్యులరయ్యా. పే స్కేల్ కూడా అమలు అవుతుంది. ఇకపై ఎలాంటి కష్టాలు ఉండవు.
నమస్తే : జూనియర్ అసిస్టెంట్గా పోస్టింగ్ ఏ డిపార్ట్మెంట్లో వస్తుందనుకుంటున్నారు?
జనార్దన్ : పదో తరగతి అర్హతతో కూడా వీఆర్ఏలను రిక్రూట్ చేశారు. పది చదివిన వారికి ఆఫీస్ సబార్డినేట్స్గా, ఇంటర్ పూర్తి చేసిన వారిని రికార్ట్ అసిస్టెంట్లుగా, ఆపై చదువు పూర్తి చేసిన వారిని జూనియర్ అసిస్టెంట్లుగా మూడు కేటగిరీల్లో నియమిస్తున్నారు. మిషన్ భగీరథ, ఇరిగేషన్, మున్సిపాలిటీ, రెవెన్యూ, విద్య, పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖల్లో మమ్ములను సర్దుబాటు చేస్తున్నారు. ఎక్కడైనా పని చేయడానికి సిద్ధంగా ఉన్నా.
నమస్తే : వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసినప్పుడు మీరు ఏం అనుకున్నారు?
జనార్దన్ : రద్దు చేసినప్పుడే వేరే డిపార్ట్మెంట్లోకి మమ్ములను అడ్జెస్ట్ చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. మా అమ్మ లాంటి డిపార్ట్మెంట్ను వదిలి వేరే దగ్గరకు ఎలా పోతామనే బాధ ఉండేది. రెగ్యులరైజ్ చేయాలనే మా కలను నెరవేర్చింది మాత్రం కేసీఆరే. మమ్ములను ప్రభుత్వ ఉద్యోగులను చేయడమంటే పెద్ద వరం ఇచ్చినట్లే. ఇంత కన్నా ఏం కావాలి.
నమస్తే : కేసీఆర్ హామీ నెరవేర్చారు. ఏ మంటారు.
జనార్దన్ : 100 శాతం ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. 2015లో ఆయనే పిలిచి జీతాలు పెంచారు. 2020లో అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏల్లో చాలా మంది పేదవారు ఉన్నారని, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని ప్రకటించారు. ఇప్పుడు అడగకుండానే క్రమబద్ధీకరించారు. దీంతో మా భవిష్యత్, మా పిల్లల భవిష్యత్ మొత్తం మారిపోతోంది. నా కుటుంబం మొత్తం సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటుంది.