ఎదులాపురం, ఫిబ్రవరి 5 : ఎంపిక చేసిన దళితబంధు లబ్ధిదారులకు యూనిట్ల స్థాపనపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. శనివారం తన క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానం ద్వారా దళిత బంధు పథకం అమలు, లబ్ధిదారుల యూనిట్ల ఎంపిక, స్థాపనలపై ప్రత్యేకాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దళితబంధు ప్రత్యేక అధికారులు రాజేశ్వర్ రాథోడ్, రవీందర్ రాథోడ్, భిక్షపతి గౌడ్ మాట్లాడుతూ, దళిత బంధు పథకం కింద లబ్ధిదారులకు యూనిట్లను ఎంపిక చేసుకోవడంలో సరైన అవగాహన లేదన్నారు. అందుకు జిల్లాస్థాయిలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా యూనిట్లను గ్రౌండింగ్ చేయవచ్చని సూచించారు. ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ యూనిట్లు, మోటర్ రవాణా, డెయిరీ తదితర యూనిట్లకు స్థాపనకు ఆయా శాఖల అధికారులు ఒక రోజు ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని సమావేశంలో తెలియజేశారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్ మాట్లాడుతూ, జిల్లాలో 268 మంది లబ్ధిదారులకు ప్రాథమికంగా ఆయా ఎమ్మెల్యేల ఆమోదంతో ఎంపిక చేశామని, వారందరికీ ఒకరోజు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ప్రత్యేక అధికారులు సూచించారని తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.