“ధర్మేచ.. అర్థే చ.. కామే చ.. నాతిచరామి” ధర్మంలోనూ.. డబ్బులోనూ.. కామంలోనూ.. నేను నిన్ను వీడి నడుచుకోను..! నీవు కూడా నన్ను విడిచిపోరాదు.. అని వరుడు అందరి ఎదుట బాస చేయడమే దీని అర్థం..! ఈ మాటలు వధూవరులిరువురికీ వర్తిస్తాయని పెద్దలు చెబుతారు..! కానీ.. కడదాకా కలిసుంటామని వేదమంత్రాల సాక్షిగా ఒక్కటైన జంటల కాపురాలు ఆదిలోనే కుప్పకూలుతున్నాయి. అగ్ని సాక్షిగా వేసిన ఏడడుగులు తడబడుతున్నాయి. మూడుముళ్లు మూణ్నాళ్ల ముచ్చటే అవుతున్నాయి.
బంధుమిత్రుల సాక్షిగా ఏకమైన మనసులు చివరిదాకా కలిసుండడం లేదు. దీనికి ప్రధాన కారణం.. అమ్మాయి తల్లిదండ్రుల అతి గారాబం, చొరవ, జోక్యమే.. నూతన జంటలు ఈగో ఫీలింగ్లకు వెళ్లడం.. స్మార్ట్ఫోన్లు, సీరియళ్లు మరో కారణంగా చెప్పవచ్చు. భర్త మద్యానికి, జల్సాలకు బానిస కావడం కూడా భార్యాభర్తల ఎడబాటుకు దారి తీస్తున్నాయి. ఇవన్నీ కూడా మహిళా పోలీస్ స్టేషన్, సఖీ కేంద్రాలకు వచ్చే కేసులను పరిశీలిస్తే అవగతం అవుతుంది. భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటే కాపురం సజావుగా సాగుతుందని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ‘నమస్తే’అందిస్తున్న సండే కథనం..
కల్యాణి(పేరు మార్చాం) తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. ఒక్కతే కూతురు కావడంతో గారాబంగా పెంచాడు. నాలుగు నెలల క్రితం ఓ ప్రభుత్వ ఉద్యోగికిచ్చి పెండ్లి చేశాడు. పెండ్లయిన పది రోజుల నుంచే.. మా పుట్టింట్లో ఏ పని చేయలేదు, ఇక్కడ పనులన్నీ నేనే చేయాల్సి వస్తున్నదని కల్యాణి తరచూ భర్తతో అంటుండేది. విసుగు చెందిన భర్త ఓ రోజు మందలించాడు. అత్తారింట్లో జరుగుతున్న విషయాలు, భర్త మందలించిన విషయాన్ని ఫోన్ ద్వారా ఏడుస్తూ తండ్రికి చెప్పింది. మన ఇంటికి వచ్చేయ్ బిడ్డా అని చెప్పడంతో కల్యాణి బట్టలు సర్దుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా అమ్మాయి తల్లిదండ్రులు వినలేదు. చివరకు కూతురుకు విడాకులు ఇప్పించారు.
సింధూజకు వివాహ సమయంలో 12 తులాల బంగారం పెట్టారు. పెళ్లయిన నెల రోజులకే తన భర్త ఆరు తులాల నగ కుదువపెట్టాడు. దీంతో సింధూజ అలిగి పుట్టింటికి వెళ్లింది. కానీ.. ఆమె తల్లిదండ్రులు సర్దిచెప్పారు. అవసరం ఉన్నప్పుడు బంగారం కుదువ పెట్టడం సాధారణం అని చెప్పారు. పోలీస్స్టేషన్కు వెళ్తే అక్కడా అదే అన్నారు. సింధూజ భర్తను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. మూడు నెలల్లో కుదువపెట్టిన నగ తెచ్చిస్తానని హామీ ఇచ్చారు. దీంతో సింధూజ తిరిగి అత్తారింటికి వెళ్లింది. ఆరు నెలల తర్వాత.. పోలీసులు ఫాలోఅప్ కోసం సింధూజకు ఫోన్ చేశారు. “తన భర్త చాలా మంచి వారని, తనకు ఏ లోటు లేదని, బంగారం ఇవాళ కాకపోతే రేపైనా చేయించుకుంటానని, నా తల్లిదండ్రులు కూడా నా వద్దకు వస్తున్నారని’ పోలీసులకు చెప్పింది. ఇప్పుడు భర్తతో కలిసి ఆనందంగా ఉంటున్నానని, తల్లిదండ్రులు చెప్పినట్లు వినకపోతే నా జీవితం వ్యర్థమయ్యేదని పేర్కొంటున్నది.
అమ్మాయి తల్లిదండ్రులు చేయాల్సిందేమిటి..
ఆడపిల్లలను గారాబంగా పెంచడంలో తప్పులేదు. కానీ.. వారికి చిన్నచిన్న పనులు కూడా చెప్పకపోవడం మంచిది కాదు. అత్తగారింటికి వెళ్లాక ఆడపిల్లలు పనులు చేయాల్సి రావడం సహజం. దానికి అనుగుణంగా పనులు నేర్పించడంలో తల్లిదండ్రులు విఫలమవుతున్నారు. ఇంటి, వంట పని నేర్పించడం లేదు. పెళ్లయ్యాక ఒకేసారి నలుగురు, ఐదుగురికి వంట చేయాల్సి వస్తే అమ్మాయిలు భయపడిపోతున్నారు. బాగోలేకపోతే ఏం అంటారోనని వంట పని నుంచి తప్పించుకుంటున్నారు. ఒకవేళ అత్తామామలు ఇలా కాదు, అలా చేయాలని చెబితే తట్టుకోలేకపోతున్నారు.
చిన్నప్పటి నుంచి కాకపోయినా.. పెండ్లి చేద్దామనుకున్నప్పుడైనా వంట, ఇంటి పని నేర్పించడం మంచిది.
అత్తారింటికి వెళ్లాక చేయాల్సిన పనులు, బంధువులతో నడుచుకోవాల్సిన విధానంపై అవగాహన కల్పిస్తే మరీ మంచిది. సంస్కారం నేర్పించాలి.
అమ్మాయి ఫోన్ చేసి ఇబ్బంది ఉందని చెప్పగానే ఆవేశ పడకుండా నిధానంగా సర్ది చెప్పాలి. ఒకటికి రెండు సార్లు అర్థమయ్యేలా చెప్పాలి. అప్పటికీ వినకపోతే ఒక్కసారి ఇంటికి పిలిచో లేదా అల్లుడి దృష్టికో తీసుకువెళ్లాలి. అప్పటికీ పరిస్థితి మారకపోతే అత్తారింటి కుటుంబంతో కూర్చొని మాట్లాడి అమ్మాయికి ఇబ్బంది లేకుండా చేయాలి. అంతే కాని రెచ్చగొట్టేలా మాట్లాడొద్దు.
అత్తింటి వారు చేయాల్సిందేమిటి..
కొత్త పెండ్లి కూతురు ఒకేసారి అన్ని పనులు చేయలేదు. ప్రతి విషయంలో వారికి సలహా లు, సూచనలు చేయడం మానుకోవాలి. ఎప్పుడో ఒకసారి సున్నితంగా, వారి మనసు నొప్పించని విధంగా అర్థమయ్యేలా చెప్పాలి. ఒక పనిని పొగుడుతూ.. ఇంకో పని ఇలా చేస్తే బాగుండు అని సూచన ప్రాయంగా చెప్పాలి. (ఉదాహరణకు.. వంట బాగా చేశావ్. కానీ.. బట్టలు ఉతికే ముందు నానపెడితే మురికి బాగా పోతుంది) ఇలా చేస్తే మనస్పర్థలు రావు. గొడవలు ఉండవు.
కొత్తలో అమ్మాయి చేసే పనుల్లో సాయం చేస్తే మంచిది. మా అత్తమ్మ చాలా మంచిదని ఫీలవుతారు. అప్పుడు ఏం ఇబ్బంది ఉండదు.
ఉద్యోగం చేసే కోడళ్లు ఉంటే వారికి అధికంగా పనులు చెప్పకపోడమే ఉత్తమం. పొద్దంతా కష్టపడేవారు ఇంటి పనులు చేయడం ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు వారు పని వారిని పెట్టుకోవడం చాలా ఉత్తమం. అత్తామామలకు, కొత్త కోడళ్లకు ఇబ్బంది ఉండదు.
అత్తంటే తల్లి అనీ, కోడలంటే మరో కూతురు అని భావించాలి. అత్త కూడా ఒకనాటి కోడలే కాబట్టి కోడలు ఆరాటాన్ని గ్రహించి, పెద్దరికంతో వ్యవహరించాలి. అత్తాకోడళ్లు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. గౌరవించుకోవాలి. అభిప్రాయాలను పంచుకోవాలి. పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోవాలి. అప్పుడే మనుగడ సాధ్యమవుతుంది. ఆ కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది.
ఆంధ్రప్రదేశ్కు చెందిన శ్రీనివాస్(పేరు మార్చాం), మంచిర్యాలకు చెందిన శాహన ప్రేమవివాహం చేసుకున్నారు. ఇద్దరు స్వయంకృషితో బెంగళూరులో ఓ కంపెనీ మొదలుపెట్టారు. రెండేండ్లలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాల్లో కంపెనీ నూతన బ్రాంచ్లూ స్థాపించారు. కంపెనీ పనుల నిమిత్తం ఇతర రాష్ర్టాలు తిరుగుతుండడంతో శ్రీనివాస్ జల్సాలకు అలవాటు పడ్డాడు. మద్యం తాగడం, విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేయడం పెరిగింది. చివరకు ఎదుటి వారిని గన్ పెట్టి బెదరించడం, వారు ఏడుస్తుంటే వీడియోలు తీయడం, వాటిని చూస్తూ ఆనందించే స్థాయికి వెళ్లి సైకోగా మారాడు. దీంతో ఆయన భార్య శాహన పోలీసులను ఆశ్రయించింది. రెండు, మూడు సార్లు కౌన్సెలింగ్ ఇవ్వగా.. కేసు పెట్టొద్దు.. నేను అన్ని మానేసి నా భార్యను బాగా చూసుకుంటా అని శ్రీనివాస్ పోలీసుతో చెప్పాడు. కానీ.. శాహనా వినలేదు. కేసు పెట్టాల్సిందేనని, కంపెలన్నీ ఇచ్చేస్తే కేసు లేకుండా వదిలేస్తానని చెప్పింది. దీంతో పోలీసులు శ్రీనివాస్తో మాట్లాడారు. ఆస్తులన్నీ అమ్మాయి పేరిట రాసిచ్చాడు. ఇప్పుడు శ్రీనివాస్ పూర్తిగా మారాడు. కానీ.. శాహన మాత్రం పట్టువిడవడం లేదు.
రాజ్కుమార్(పేరు మార్చాం) సింగరేణి ఉద్యోగి. స్వప్న విద్యుత్ శాఖలో ఏఈ. వీరిద్దరికి ఏడాదిన్నర క్రితం పెండ్లయింది. రాజ్కిరణ్ తండ్రి చనిపోవడంతో ఆయన తల్లి కూడా వీరితోనే ఉండేది. ఈ క్రమంలో కోడలును ఇలా పని చేయాలి, ఇంటికి వచ్చిన వారితో ఎలా ఉండాలో అని అత్తమ్మ సలహాలు ఇస్తుండేది. ఇది నచ్చని స్వప్న నేను ఏం చేసినా మీ అమ్మకు నచ్చదు అని భర్తతతో ఘర్షణ పడుతుండేది. ఈ క్రమంలో స్వప్న ప్రెగ్నెన్నీ కన్ఫమ్ కాగా.. పుట్టింటికి వెళ్లిపోయింది. అయినా భార్యాభర్తలు గొడవ పడుతూనే ఉండేవారు. ఓ పాప పుట్టినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో భార్యాభర్తలు విడిపోవాల్సి వచ్చింది.
ఏ ఇంట్లోనైనా మగపిల్లల కంటే ఆడబిడ్డలను గారాబంగా పెంచుతారు. ఎప్పటికైనా పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లిపోతుందనే భావనతో ఏదీ తక్కువ కాకుండా చూసుకుంటారు. ముఖ్యంగా ఇంట్లో ఏ పని చెప్పరు. దీంతో పెళ్లయ్యాక కూడా జీవితం ఇలాగే ఉండాలని కొందరు ఆడపిల్లలు కోరుకుంటున్నారు. అంచనాలకు మించి ఆలోచిస్తున్నారు. పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్లాక ఆ కుటుంబ బాధ్యత తమదేనని గుర్తించడం లేదు. అత్తామామలతో ఉండడాన్ని ఇష్టపడడం లేదు. నా భర్తకు పని చేస్తా.. కానీ.. అత్తామామలకు ఎందుకు చేయాలనే భావనలో ఉండిపోతున్నారు. ఇంటిపని చేయడాన్ని భారంగా పరిణమిస్తున్నారు. వేరే ఇంట్లో కాపురం పెడదామని భర్తతో పట్టుబడుతున్నారు. అత్తారింట్లోని విషయాలు తల్లిదండ్రులకు చేరవేయడం.. ఇన్నాళ్లు గారాబంగా పెరిగిన నా కూతురు కష్టపడుతుందని అమ్మాయి తల్లిదండ్రులు ఫీలవుతున్నారు. వాళ్లు అంటే నీవెందుకు పడతావు, నీకు ఏం తక్కువ బిడ్డా.. అని ప్రోత్సహిస్తుండడంతో పరోక్షంగా గోడవలు పెరగడానికి కారణం అవుతున్నారు. ఈ గొడవలు కాస్తా పెద్దవిగా మారి విడిపోయే వరకు వెళ్తున్నాయి. దీనికితోడు తెలుగు చానళ్లలో వస్తున్న సీరియళ్లు గొడవలకు ఆజ్యం పోస్తున్నాయి. అత్తాకోడళ్ల మధ్య విషభీజాలు నాటుతున్నాయి.
– మంచిర్యాల, అక్టోబర్ 15(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
వేరు కాపురం.. దీర్ఘకాలిక అనర్థం..
పెండ్లి కాగానే అత్తామామల నుంచి వేరు పడటం సరికాదు. భర్తలను బలవంతంగా తల్లిదండ్రుల నుంచి వీడదీయడం దీర్ఘకా లంలో అనర్థాలకు దారి తీస్తుంది. ఏడాదో.. రెండేళ్లో వారితో కలిసి ఉంటేనే మంచిది. అప్పుడే భార్యాభర్తల మధ్య గొడవలు జరగకుండా ఉంటాయి. అబ్బాయిలు ఏమైనా అనాలన్నా ఆలోచిస్తారు. ఏం చెప్పాలన్నా భార్యను పక్కకు పిలిచి అర్థమయ్యేలా చెబుతారు. కొన్ని విషయాల్లో అత్తామామలు సర్దిచెబుతారు. దీంతో గొడవలకు ఆస్కారం తక్కువ.
అదే బలవంతంగా వేరు పడితే మా తల్లిదండ్రుల నుంచి తీసుకొచ్చేసిందనే భావన మగవారిలో పెరుగుతుంది. దీంతో చిన్నచిన్న విషయాలకే చిరాకు పడిపోతుంటారు. చివరకు అది పెద్ద అనర్థాలకు దారి తీస్తుంది. నువ్వు ఎంత అంటే నువ్వు ఎంతనే స్థాయికి వెళ్లి చివరకు విడిపోయే వరకు వస్తుంది.
ఒకరికి ఒకరు తోడుగా..
కొత్తగా పెండ్లయిన వారు మొదటగా ఒకరిని ఒకరు అర్థం చేసుకో వాలి. వారి మనోభావాలను పంచుకోవాలి. ఉద్యోగాల హడావు డి ఉన్నా ఫ్రీటైంలో ఫోన్ చేసుకోవాలి. సమయానికి ఇంటికి రావడం ఉత్తమం. అలా కాకుండా పెండ్లయ్యాక హనీమూన్ వంటిది ప్లాన్ చేసుకోవాలి. అక్కడ జీవితం గురించి ఒక ప్రణాళిక రూపొందించుకోవాలి. దానికి అనుగుణంగా ఇద్దరు నడుచుకోవా లి. ప్రతి విషయాన్ని పడుకునే ముందు చర్చించుకోవాలి. పని విషయంలో ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. ఈగో ఫీలింగ్లకు పోకూడదు. ఏ పొరపాటు ఉన్నా ఇద్దరు కలిసి అభిప్రాయాలు పంచుకోవాలి. మనసులో పెట్టుకోవడం మంచిది కాదు. ఇద్దరు అనుకున్న విషయాలకు కట్టుబడి ఉండాలి. అటువంటప్పుడే పండంటి కాపురం అవుతుంది. ఇతరులకు ఆదర్శజంటగా ఉంటారు. మీ గురించే గొప్పగా చెప్పుకుంటారు.
రోజుకూ ఐదు నుంచి ఆరు..
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్న మా పోలీస్స్టేషన్కు రోజూ సగటున ఐదు నుంచి ఆరు కేసులు వస్తుంటాయి. ఎక్కువ కేసులకు తల్లిదండ్రుల అతి గారాబమే కారణం అవుతున్నది. మేం సర్ది చెప్పాక పిల్లలు వింటున్నా.. తల్లిదండ్రులు రెచ్చగొట్టి మరీ విడిపోయేందుకే ప్రోత్సహిస్తున్నారు. ఇలా వచ్చే కేసులో విడిపోయే వారు 20 నుంచి 25 శాతం వరకు ఉంటున్నారు. పర్సనల్ ఈగోలకు పోయి కూడా చాలామంది స్టేషన్కు వస్తున్నారు. మా దగ్గర కాకపోతే కోర్టు వరకు వెళ్తున్నారు. వచ్చే ప్రతి కేసును సర్దిచెప్పి పంపడానికే ప్రయత్నిస్తున్నాం. ఎంత చెప్పినా వినని పరిస్థితి ఉంటేనే కేసు పెడుతున్నాం.
– శ్రీనివాస్, మహిళా పోలీస్స్టేషన్ సీఐ, మంచిర్యాల.
ఎక్స్పర్టేషన్స్ ఎక్కువై ఇబ్బందులు..
పెళ్లి అయ్యాక జీవితం చాలా బాగుంటుందని నూతన దంపతులు ఊహించుకుంటున్నారు. వారి ఊహలకు అనుగుణంగా జీవితం ఉండకపోవడంతో ఘర్షణలకు దిగుతున్నారు. నిరాశ నిస్రృహల్లోకి వెళ్తున్నారు. దీనినే ఎక్స్పర్టేషన్ రియాలిటీ ఎంట్రోపీ అంటారు. అనుకున్నది ఒకటైతే రియాలిటీలో మరొకటి జరగడం. ఉన్న ఆర్థిక పరిస్థితి, ఖర్చులు, ఇతర విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని అర్థం చేసుకొని కాంప్రమైజ్ అయ్యేవారిలో ఇబ్బంది లేదు. అలా కాకుంటేనే విషయం విడిపోయే వరకు వస్తుంది.
– ఓం ప్రకాశ్, ఇన్చార్జి హెచ్వోడీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాలజీ, రిమ్స్.