ఎదులాపురం, ఆగస్టు 17 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 21న నిర్వహించే వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. బుధవారం అరణ్య భవన్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి హరితహారంపై సమీక్షించారు. అడవుల విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం హరితహారం చేపట్టిందని గుర్తు చేస్తూ.. 230 కోట్ల మొక్కలు రాష్ట్ర వ్యాప్తంగా నాటాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటాలని, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు.
కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ ఈ సంవత్సరం జిల్లాలో 44.74 లక్షలు మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 34.71 లక్షలు నాటించడం పూర్తయ్యిందన్నారు. ఈ నెల 21న ప్రభుత్వం నిర్ణయించిన 10.08లక్షల మొక్కలను బృహత్ పల్లె ప్రకృతి వనాలు, మల్టీలేయర్, ఇరిగేషన్ శాఖ అధీనంలోని భూములు, మావల అర్బన్ పార్క్, బోథ్ అర్బన్ పార్క్లో నాటించనున్నట్లు వెల్లడించారు. కాన్ఫరెన్స్లో స్ధానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జిల్లా అటవీ శాఖ అధికారి రాజశేఖర్, డీఆర్డీవో కిషన్, జడ్పీ సీఈవో గణపతి, డీపీవో శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శైలజ, డీఈవో ప్రణీత, రవీందర్ పాల్గొన్నారు.