కడెం, ఆగస్టు 8 : కడెం ప్రాజెక్టు వద్ద జరుగుతున్న మరమ్మతు పనులను సోమవారం ఆయకట్టు సీఈ శ్రీనివాస్, ఎస్ఈ సుశీల్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల వివరాలను ఇక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గేట్లను మూసివేసి నీటిని స్టోరేజ్ చేసేలా పనులను అధికారులు యుద్ధ ప్రాతిపదికన చేపడు తున్నారు. ఇప్పటికే 18 గేట్లకు గానూ 10 గేట్లను కిందికి దించిన అధి కారులు మిగిలిన 8 గేట్ల పనులు చేపడుతున్నారు. ఈ సందర్భంగా సీఈ శ్రీనివాస్, ఎస్ఈ సుశీల్కుమార్ మాట్లాడారు. రైతులకు హామీ ఇచ్చిన ప్రకారం ఈ నెల 25వ తేదీ వరకు పనులు పూర్తి చేసి, ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నింపి కాలువల ద్వారా నీటిని సరఫరా చేస్తామని పేర్కొన్నారు. వారి వెంట ఈఈ రాజశేఖర్, డీఈ భోజ దాస్, ఏఈలు, సిబ్బంది, తదితరులు ఉన్నారు.