సమైక్య పాలకుల పట్టింపులేని తనంతో చీకట్లో మగ్గిన గిరి పల్లెలు, స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు చొరవతో ప్రగతి బాట పట్టాయి. ప్రభుత్వం అడవిబిడ్డల సంక్షేమమే ధ్యేయంగా ఐటీడీఏ ద్వారా లెక్కకు మంచి పథకాలు అమలు చేస్తుండగా, సకల సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. 500 జనాభా కలిగిన ఊళ్లను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేయగా, గణనీయమైన అభివృద్ధి సాధిస్తున్నాయి. మన ఊరు-మనబడిలో భాగంగా ఈ ఏడాది నుంచి ఆంగ్ల విద్యనందిస్తుండగా, ఇన్నాళ్లూ మండల కేంద్రాలకు పరుగులు తీసిన అడవిబిడ్డలు ఇప్పుడు సొంతూళ్లోనే ఇంగ్లిష్ నేర్చుకుంటున్నారు. ఇక పంటల సాగుకు ప్రోత్సాహమందిస్తూనే.. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పిస్తున్నది. నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా, వారి బతుకుల్లో వచ్చిన మార్పుపై ప్రత్యేక కథనం..
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : సమైక్య పాలనలో చీకట్లో మగ్గిన ఆదివాసీ జనం.. స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రగతి బాట పడుతున్నది. ప్రభుత్వం ఐటీడీఏ ద్వారా లెక్కకు మించి పథకాలు అమలు చేస్తుండగా, వాటిని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తున్నది. పల్లెపల్లెనా విద్య, వైద్యం, రవాణా సౌకర్యం మెరుగుపడుతున్నది. 500 జనాభా కలిగిన గూడేలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేసి ‘మా ఊళ్లో.. మా రాజ్యం’ కలను సాకారం చేసింది. గిరిజన గ్రామాలు స్వావలంభన దిశగా అడుగులు వేసేందుకు మార్గం సుగమం చేసింది. గిరిజనుల సంక్షేమం కోసం రాజ్యాంగం కల్పించిన హక్కులు, గిరిజన చట్టాల అమలు పంచాయతీల తీర్మానాలతో మరింత పటిష్టం చేసుకునే అవకాశం కల్పించింది. పంటల సాగుకు రైతన్నలకు ప్రోత్సాహమందిస్తూనే.. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పిస్తున్నది. అడవిబిడ్డల సంస్కృతీ సంప్రదాయాలకు ప్రాధాన్యమిస్తూ.. వారి పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నది.
ఐటీడీఏ ప్రణాళికలతో అభివృద్ధి బాట..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గిరిజనులను అన్నిరంగాల్లో అభివృద్ధి పరిచేందుకు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) నిర్ధిష్టమైన ప్రణాళికలు రూపొందించింది. గిరిజన సంక్షేమంలో ముఖ్యమైన వ్యవసాయం, నీటిపారుదల రంగాలతో పాటు యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు చర్యలు చేపట్టింది. గిరి వికాసం పథకం ద్వారా రూ. 6 కోట్లతో ఆదివాసీల భూములకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. గిరిజన గ్రామాలకు రోడ్లు వేయడంతో పాటు, అడవిబిడ్డలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఐటీడీఏ ద్వారా భారీగా నిధులు కేటాయించింది.
గిరిజన యువతకు ఆటోలు, సెంట్రింగ్ యూనిట్లు, కాంట్రీట్ మిక్షర్ యూనిట్లు, డీటీపీ జిరాక్స్ స్క్రీన్ ప్రింటింగ్ యూనిట్లు, కిరాణాలు, పిండిగిర్ని యూనిట్లు, పికప్వ్యాన్లు, టైలరింగ్, టెంట్ హౌస్ యూనిట్లు, ట్రాన్స్పోర్టు వాహనాలు, కూరగాయల అమ్మకపువంటి యూనిట్లు అందిస్తున్నది. వీటితో పాటు గేదెలు, గొర్రెలు, మేకలకు సంబంధించిన యూనిట్లనూ సబ్సిడీ ద్వారా అందిస్తున్నది. దవాఖానల్లో ప్రసవాలు పెంచేందుకు ప్రత్యేకంగా అమ్మఒడి, అవ్వాల్ అంబులెన్స్లను సమకూర్చింది. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టిన కేసీఆర్ కిట్లు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. కల్యాణ లక్ష్మి ద్వారా గిరిజన యువతుల పెళ్లిళ్లకు రూ. లక్షా116 ఆర్థిక సాయం అందిస్తున్నది.
మారుమూల పల్లెల్లో ఆంగ్ల విద్య..
మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది నుంచి ఆంగ్ల విద్య ప్రవేశపెట్టగా గిరిజన విద్యార్థులకు సైతం ప్రయోజనం చేకూరుతున్నది. ఇన్నాళ్లూ అ.. ఆ…లు దిద్దిన అడవి బిడ్డలు.. ప్రస్తుతం ఏ,బీ,సీ,డీ..లు దిద్దుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్యా బోధనతో గిరిజన విద్యలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మారుమూల గిరిజన గ్రామాల్లో సైతం మంచి విద్యా వసతులు అందుబాటులోకి వచ్చాయి. ఇంగ్లిష్ మీడియం కోసం ఇన్నాళ్లూ మండల కేంద్రాలకు పరుగులు తీసిన గిరి పిల్లలు ఇప్పుడు సొంతూళ్లోనే ఆంగ్ల విద్యను అభ్యసిస్తున్నారు.
జోడెఘాట్కు ప్రత్యేక గుర్తింపు
దశాబ్ధాలుగా సరైన రహదారికి కూడా నోచుకోని జోడెఘాట్ గ్రామానికి రూ. 15.95 కోట్లతో రెండు వరుసల రహదారిని ప్రభుత్వం నిర్మించింది. కెరమెరి మండలం హట్టి నుంచి 23 కిలోమీటర్ల దూరంలోని జోడెఘాట్కు 8 గ్రామాలను కలుపుతూ రెండు వరుసల రహదారి నిర్మాణం పూర్తి చేసింది. జోడెఘాట్కు సరైన రోడ్డులేక ఇబ్బందులు పడుతున్న ఈ ప్రాంత వాసుల సమస్యలు పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. జోడెఘాట్లో రూ. 25 కోట్లతో స్మారక చిహ్నం, గిరిజన మ్యూజియాన్ని నిర్మించి, వారి ఖ్యాతిని ప్రపంచానికి తెలిసేలా చేసింది. సంస్కృతీ సంప్రదాయలతో పెనవేసుకున్న ఆదివాసుల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వం వారి సంక్షేమానికి బాటలు వేస్తోంది.
నేడు జిల్లా కేంద్రంలో వేడుకలు..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవన్లో మంగళవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. జిల్లా నలుమూలల నుంచి ఆదివాసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ సంస్కృతీ సంప్రదాయాలతో వేడుకలు నిర్వహించనున్నారు.