ఆదిలాబాద్ రూరల్, జూలై 1: సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి స్ఫూర్తితో ప్రతి వార్డులో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. వార్డు వాచ్లో భాగంగా శుక్రవారం పట్టణంలోని 24వ వార్డు భాగ్యనగర్లో కాలినడకన తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి సమస్యను పరిష్కరించేందుకు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ సురక్షితమైన తాగు నీరు అందిస్తున్నామన్నారు.
వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని నెల రోజుల నుంచి పారిశుధ్య పనులు ముమ్మరంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు వేగంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ అశోక్ స్వామి, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
పారిశుధ్య కార్మికుల సేవలు అభినందనీయం
మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సేవలు అభినందనీయమని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మారెమ్మ ఆలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ వార్షికోత్సవ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు చీరెలు, దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.