ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 17: పట్టణాన్ని కాలుష్యరహితంగా మార్చడమే ధ్యేయంగా ముందుకుసాగుతున్నామని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బంగారుగూడలో రూ.2.56 కోట్లతో ఏర్పాటు చేసిన ఫికల్ స్లాడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్(ఎఫ్ఎస్టీపీ)ను ఎమ్మెల్యే జోగు రామన్న, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్తో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడారు. అంటువ్యాధులు ప్రబలకుండా, అనారోగ్యం బారిన పడకుండా ఈ ప్లాంట్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
మున్సిపాలిటీలో సేకరించిన బయోవ్యర్థాలను ప్లాంట్లో శుద్ధి చేయనున్నట్లు తెలిపారు. వ్యర్థాల నుంచి ఎరువులు తయారు చేస్తారని, వాటి నుంచి వచ్చిన నీటిని శుద్ధి చేసి ప్లాంట్ పరిసరాల్లో ఇతర పనులకు వినియోగిస్తారని, మున్సిపాలిటీలోని నర్సరీలకు సైతం ఉపయోగిస్తారని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 71మున్సిపాలిటీల్లో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సెప్టిక్ ట్యాంక్ మెటీరియల్, మానవ వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడవేయవద్దని ఎమ్మెల్యే జోగు రామన్న కోరారు. సెప్టిక్ట్యాంక్ వ్యర్థాల ద్వారా ఇక్కడ ఎరువులు తయారు చేయనున్నట్లు చెప్పారు. సెప్టిక్ట్యాంక్ నిర్వాహకులకు లైసెన్సులు అందజేశారు. అంతకు ముందు ప్లాంట్ ఏరియాలో మొక్కలు నాటి నీరు పోశారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డేవిడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, కమిషనర్ శైలజ, ఆస్కోటీం మేనేజర్ రంజిత్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
నిరుపేద దళితులకు మూడెకరాల భూమి
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న
నిరుపేద దళిత కుటుంబాలకు మూడెకరాల చొప్పున భూమిని ప్రభుత్వం అందజే స్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో రాంపూర్ (టీ)కి చెందిన దళిత మహిళకు భూమి పట్టా సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. దళితబస్తీ పథకం ద్వారా మూడెకరాల భూమి అందజేయడంతో పాటు పెట్టుబడి సాయం, సాగునీటి సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, నాయకుడు రంగినేని వెంకట్రావు తదితరులు ఉన్నారు.