ఆదిలాబాద్ రూరల్, జూన్ 22 : మున్సిపాలిటీలోని బంగారుగూడ కాలనీలోని సమస్యలన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. వార్డు విజిట్లో భాగంగా బుధవారం పలు సంఘ భవనాలకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే కాలనీవాసులకు ఇండ్ల నంబర్లు కేటాయించి, ట్యాక్స్లు వచ్చేలా చేస్తామన్నారు. అలాగే డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నిత్యవసర వస్తువుల ధరలు పెంచుతూ పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తున్నదని మండిపడ్డారు.
ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్ముతూ పేదల నోట్లో మట్టికొడుతున్నదని విమర్శించారు. ఎనిమిదేళ్లుగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ నాయకులు వంట గ్యాస్, పెట్రోల్ ధరలను ఇష్టమచ్చినట్లు పెంచి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం పేదలను అన్ని విధాలా ఆదుకుంటున్నదన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, మున్సిపల్ కమిషనర్ శైలజ, నాయకులు యూనిస్ అక్బానీ, మంచాల మల్లయ్య, సత్యనారాయణ, పోతన్న తదితరులు పాల్గొన్నారు.
రామాయిలో సవారీ బంగ్లా షెడ్డుకు భూమి పూజ..
ఆదిలాబాద్ టౌన్, జూన్ 22 : ఆదిలాబాద్ రూరల్ మండలం రామాయి గ్రామంలో సవారీ బంగ్లా షెడ్డు కోసం ఎమ్మెల్యే జోగు రామన్న భూమి పూజ చేశారు. అనంతరం పీరీల బంగ్లాలో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక భావనతో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుందని, తద్వారా ప్రగతి సుసాధ్యమవుతుందని అన్నారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం గ్రామస్తుల సమస్యలను సావధానంగా విన్నారు. క్రమంగా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గండ్రత్ రమేశ్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ కొడప సోనేరావు, సర్పంచ్ కే విఠల్, నాయకులు భూమన్న, రాంరెడ్డి, లచ్చన్న, గంగన్న, కిషన్, రామన్న, గ్రామస్తులు ఉన్నారు.
దీపాయిగూడలో మైసమ్మఆలయ నిర్మాణానికి..
జైనథ్, జూన్ 22 : జైనథ్ మండలం దీపాయిగూడలో మైసమ్మ ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సనాతన ధర్మంలో పొచమ్మ, మైసమ్య దేవతలకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నదన్నారు. అందరూ సంతోషంగా ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని యేటా మొక్కులు చెల్లించడం, బోనాలు తీయడం ఆనవాయితీగా వస్తున్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, సర్పంచ్ బీ గంగన్న, ఉప సర్పంచ్ కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ నడిపెన్న, నాయకులు అశోక్ తదితరులు పాల్గొన్నారు.