లక్షెట్టిపేట పట్టణాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రజాప్రతినిధులు, అధికారులు ముందుకెళ్తున్నారు. గోదావరి తీర అందాలు, అవతలి పక్కన కోటి లింగాల దేవస్థానం, బోటింగ్, రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద సీఎస్ఐ చర్చి, పార్కులు, జిమ్లు, ప్రముఖ పుణ్యక్షేత్రాలు, గురుకులాలు, మోడల్ డిగ్రీ కళాశాల ఇలా అనేక చూడదగిన ప్రదేశాలు ఉండగా, అందుకు అనువైన ప్రాంతంగా భావిస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే టూరిజం శాఖ అధికారులతో సంప్రదింపులు జరుపగా, వారు సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే దివాకర్రావు తెలిపారు.
లక్షెట్టిపేట, జూన్ 22 : లక్షెట్టిపేట పట్టణాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు ప్రజాప్రతినిధులు. ఇప్పటికే తెలంగాణ టూరిజంశాఖ అధికారులతో సంప్రదింపులు కూడా జరిపారు. పట్టణ ప్రజల ఆహ్లాదం కోసం ఇప్పటికే పలు వార్డుల్లో చిన్న చిన్న పార్కులు, జిమ్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ ప్రాంతంలో చూడదగిన ప్రదేశాలు అనేకం ఉండగా, పాలకవర్గం పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నది. ఈ నిర్ణయంతో మున్సిపాలిటీకి ఆదాయం పెరగడంతో పాటు ప్రజలు ఆనందంగా గడిపే ఆస్కారముంటుంది. ఈ ప్రాంతంలో పర్యాటక కేంద్రానికి అనుకూలమైన వాతావరణంతో పాటు అనేక సౌకర్యాలు ఉండడం విశేషం. పట్టణంలో పలు దేవాలయాలు, పవిత్ర గోదావరి నది, చర్చి, టేకు వనం ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇప్పటికే ఇక్కడ గురుకులాలతో పాటు మోడల్ డిగ్రీ కాలేజీ ఉండగా, ఎడ్యుకేషనల్ హబ్గా పట్టణానికి పేరు వచ్చింది. ప్రతి శని, ఆదివారాల్లో ఇక్కడున్న గురుకులాల్లోని తమ పిల్లలను చూసేందుకు వందలాది మంది తల్లిదండ్రులు వస్తుంటారని, వారికి కూడా ఆహ్లాదం దొరుకుతుందని పాలకులు ఆలోచిస్తున్నారు. ఇది టూరిజం స్పాట్ అయితే.. రాష్ట్రంలోనే ఉత్తమ మున్సిపాలిటీగా నిలుస్తుందనే ఆలోచనలు కూడా ఉన్నాయి.
అందాలకు నెలవు.. గోదావరి తీరం..
ఇక్కడి గోదావరి తీరం ప్రకృతి అందాలకు నెలవుగా మారింది. ఉదయం చాలా మంది ఇక్కడికి మార్నింగ్ వాక్కు వస్తుంటారు. సాయంత్రం చిన్నా.. పెద్దలంతా ఆహ్లాదం కోసం వస్తుంటారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో గోదావరి నిండుకుండలా దర్శనమిస్తూ కనువిందు చేస్తుంది. అవతలి ఒడ్డున ఉన్న కోటి లింగాల దేవాలయంలో పూజారులు జపించే మంత్రాలు ఇక్కడికి వినిపిస్తాయి. అంతేగాకుండా అక్కడ టూరిజం శాఖ ఏర్పాటు చేసిన బోట్లు ఇక్కడి వరకు వచ్చి వెళ్తుంటాయి. ఇటువైపు కూడా బోటింగ్ ఏర్పాటు చేస్తే కోటి లింగాలతో పాటు ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు సందర్శకులను తీసుకెళ్లవచ్చు.
రాష్ట్రంలో అతిపెద్ద రెండో చర్చి..
లక్షెట్టిపేట పట్టణంలోని చర్చి.. రాష్ట్రంలోనే రెండో పెద్ద సీఎస్ఐ చర్చిగా పేరుగాంచింది. సుమారు వంద ఎకరాల్లో ఇది విస్తరించి ఉంది. దీని చుట్టూ అడవిని తలపించేలా టేకు వనం ఉంది. వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఊడల మర్రి చెట్టు ఉండడం విశేషం. ప్రతి రోజూ అనేక మంది ఇక్కడికి వచ్చి సేదతీరుతుంటారు. గతంలో ఈ చర్చి అనుసంధానంలో పెద్ద మిషన్ హాస్పిటల్ కూడా ఉండేది. చుట్టూ ఉన్న 10 మండలాల్లో ఇదే పెద్ద దవాఖాన. అది మూసివేయబడింది. సీఎస్ఐ ఫాస్టర్స్ సైతం మిషన్ హాస్పిటల్ను పునఃప్రారంభించే యోచనలో ఉన్నారు.
బోటింగ్ ఏర్పాటు చేస్తాం
లక్షెట్టిపేట గోదావరి ఎప్పుడూ నిండు కుండలా కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో బోటింగ్ ఏర్పాటు చేయాలన్నదే నా సంక ల్పం. ఇప్పటికే టూరిజం శాఖ అధికా రులతో సంప్రదింపులు జరిపాం. వారు కూడా సరే అన్నారు. ఇప్పటికే కొన్ని నిధులు కూడా ఇచ్చాను. ఈసారి ఎలాగైనా గోదావరి ఒడ్డున పార్కులతో పాటు బోటింగ్ ఏర్పాటు చేసి తీరుతాం.
– నడిపెల్లి దివాకర్రావు, మంచిర్యాల ఎమ్మెల్యే
ఇప్పటికే తీర్మానం చేశాం
గోదావరి ఒడ్డున ఎల్లంపల్లి ముంపు భూములను ప్రభుత్వ ఆనుమతితో మున్సిపా లిటీకి తీసుకొని పార్కు ఏర్పాటు చేయాలని అనుకున్నాం. గతంలో పంచాయతీగా ఉన్న సమయంలో తీర్మానం కూడా చేశాం. బోటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత పార్కు కూడా అందుబా టులోకి తెస్తాం. పార్కు కోసం కొన్ని ట్రస్ట్లు కూడా సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. మన ఎమ్మెల్యే చెప్పినట్లు గానే మన ప్రాంతాన్ని ఎడ్యుకేషనల్ హబ్గా మార్చాడు. – శ్రీనివాస్ గౌడ్,
మున్సిపల్ వైస్ చైర్మన్, లక్షెట్టిపేట
పట్టణం మరింత అభివృద్ధి చెందుతుంది
లక్షెట్టిపేట పట్టణ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చేందుకు అన్ని వసతులు ఉన్నాయి. ఇప్పటికే చాలా అభివృద్ధి చేశాం. కొత్త మున్సిపాలిటీ కావడంతో ఆదాయ మార్గాలు పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఇక్కడ గోదావరి నదితో పాటు చర్చి, టేకు వనం, కాకుల గుట్ట, పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి. పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే పట్టణం మరింత అభివృద్ధి చెందుతుంది.
– నలుమాసు కాంతయ్య.మున్సిపల్ చైర్మన్, లక్షెట్టిపేట