దస్తురాబాద్, జూన్ 22 : మండల కేంద్రానికి చెందిన చెవులమద్ది నర్సయ్య (బాషా) (40) ఉపాధి కోసం ముంబై వలస వెళ్లి ఈ నెల 20న గుండెపోటుతో మృతిచెందాడు. మృతదేహాన్ని బుధవారం స్వగ్రామానికి తీసుకురాగా కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. స్వగ్రామంలో ఆస్తిపాస్తులు లేని నర్సయ్య ఉపాధి కోసం 25సంవత్సరాల కిందట ముంబై వలస వెళ్లాడు. అక్కడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడపకు చెందిన స్రవంతితో పరిచయం ఏర్పడి పెళ్లికి దారితీసింది.
వీరికి 4, 6 ఏండ్ల వయస్సున్న ఇద్దరు కూతుళ్లున్నారు. డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించడం భారంగా మారడంతో కొన్నాళ్ల కిందట కుటుంబంతో కలిసి కడపకు వెళ్లాడు. అక్కడ కూడా ఉపాధి దొరక్కపోవడంతో తిరిగి ముంబైకి వెళ్లిపోయారు. ఇటీవల స్వగ్రామంలో జరిగిన తన సోదరుడి కూతురు వివాహం కోసం వచ్చిన నర్సయ్య… భార్య, ఇద్దరు కూతుళ్లను ఇక్కడే వదిలి ఒక్కడే ముంబైకి వెళ్లి గుండెపోటుతో మృతి చెందాడు. నిరుపేద కుటుంబం, భర్తను కోల్పోయి ఇద్దరు కూతుళ్ల భారం మీద పడడంతో సాయం కోసం స్రవంతి ఎదురుచూస్తున్నది. దాతలు ఎవరైనా 90107 72825 నంబర్కి ఫోన్ పే, గూగుల్ పే ఆర్థిక సాయం చేసి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటున్నది.