ఎదులాపురం, జూన్ 22 : జిల్లాలో ఇసుక క్వారీలకు ప్రభుత్వ అనుమతులు లేవని, అక్రమంగా ఇసుక తరలించే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా మైనింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఏ.రవిశంకర్ పేర్కొన్నారు. మొరం క్వారీలకు సైతం అనుమతులు లేవనే విషయాన్ని వెల్లడిస్తూ తరలించేవారిపై కేసులు తప్పవని హెచ్చరించారు.
జిల్లాలో గడిచిన మూడు నెలల్లో ఇసుక, మొరం, కంకరను ఆక్రమంగా తరలిస్తున్న వారిపై 32 కేసులు నమోదు చేసి రూ.2,09,840 జరిమానా విధించినట్లు తెలిపారు. ఇసుకకు సంబంధించి 22 కేసుల్లో రూ.1,70,000, స్టోన్, మెటల్కు సంబంధించి 6 కేసుల్లో రూ.27,300, మొరం తరలిస్తున్న వారిపై 4 కేసులు నమోదు చేసి రూ.12,540 జరిమానా విధించినట్లు వివరించారు. ఇటుక బట్టీల వ్యాపారులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని స్పష్టం చేశారు.