సోన్, జూన్ 22 : మండల కేంద్రంతో పాటు మాదాపూర్ గ్రామంలో మంగళవారం చోరీకి పాల్పడిన ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్లు నిర్మల్ డీఎస్పీ జీవన్రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్లో బుధవారం ఆయన వెల్లడించిన కేసు వివరాలివీ.. అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులైన బత్తుల వెంకట్రావ్ అలియాస్ వెంకి గంగయ్య, షేక్ మస్తాన్వలీ, చల్లా సురేశ్ అనే ముగ్గురు సోన్ మండల కేంద్రంలోని మురళీధర్రెడ్డి ఇంట్లోకి ప్రవేశించి బీరువాను తెరిచి రెండు బంగారు గొలుసులు, రెండు జతల కమ్మలు, రెండు బంగారు ఉంగరాలను అపహరించారు. అంతకుముందు మాదాపూర్ గ్రామంలో చోరీకి పాల్పడ్డారు. వీరు గతంలో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, తెలంగాణలోని ఖమ్మం, నిర్మల్ జిల్లాలో చోరీలకు పాల్పడినట్లు డీఎస్పీ వెల్లడించారు.
గుంటూరు జిల్లాకు చెందిన చల్లా సురేశ్ చోరీ కేసుల్లో జైలు శిక్ష అనుభవించి వారం రోజుల కిందటే విడుదలయ్యాడని తెలిపారు. సురేశ్ పని నిమిత్తం సోన్ మండలంలోని పాక్పట్ల గ్రామానికి రాగా బత్తుల వెంకట్రావ్ అలియాస్ వెంకి గంగయ్య, షేక్ మస్తాన్వలీతో పరిచయం ఏర్పడిందని వెల్లడించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సోన్ సీఐ రాంనర్సింహారెడ్డి, ఎస్ఐ రవీందర్ దర్యాప్తు ప్రారంభించగా నిర్మల్ పరిసర ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని పట్టుకుని విచారించగా నేరం అంగీకరించారని చెప్పారు. చోరీకి గురైన బంగారు వస్తువులతో పాటు మూడు సెల్ఫోన్లు, బైక్, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకొని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. 24గంటల వ్యవధిలో అంతరాష్ట్ర ముఠాను పట్టుకున్న సీఐ, ఎస్ఐ, పోలీసు సిబ్బందిని ఎస్పీ ప్రవీణ్కుమార్ అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు.