ఆదిలాబాద్ రూరల్, జనవరి 30: ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం అమలులో భాగంగా అందరికీ విద్య అందించేందుకు బడి బయట పిల్లలను గుర్తించి వారిని పాఠశాలలో చేర్పించేందుకు విద్యాశాఖ ప్రత్యేక సర్వే చేపట్టింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఇంటింటికీ తిరిగి చదువు మధ్యలో మానేసిన వారి వివరాలను సీఆర్పీలు సేకరించారు. ఆర్థిక స్థోమత లేక మధ్యలో చదువు మానేసి పనులకు వెళ్లే వారిని గుర్తించి తిరిగి బడిలో చేర్పించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.
మున్సిపాలిటీతో పాటు గ్రామాల్లో..
పట్టణంలోని 49 వార్డులతో పాటు ఆదిలాబాద్ రూరల్లోని 39 గ్రామ పంచాయతీలు, మావలలోని 3 గ్రామ పంచాయతీల్లో ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించారు. జడ్పీ, ఎంపీపీ, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. బడి బయట పిల్లలను గుర్తించేందుకు జిల్లా విద్యాశాఖ యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఐఈఆర్పీలు, సీఆర్పీలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ నెల 11 నుంచి 25 వరకు బడి బయట విద్యార్థుల గుర్తింపు కార్యక్రమం నిర్వహించారు. 14 నుంచి 19 ఏళ్లున్న విద్యార్థులను పనుల వద్దకు వెళ్లి గుర్తించారు. వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి పాఠశాలల్లో చేర్పించారు. ఆదిలాబాద్ పట్టణంలో 25 మందిని, మావలలో 5, ఆదిలాబాద్రూరల్లో 15 మందిని బడి మానేసిన వారిని గుర్తించి తిరిగి పాఠశాలల్లో చేర్పించారు.
బడుల్లో చేర్పించేలా చర్యలు..
నిర్బంధ విద్య కార్యక్రమంలో భాగంగా ప్రతి విద్యార్థి బడుల్లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. గ్రామాల్లో, వార్డుల్లో ప్రత్యేకంగా సీఆర్పీలు ఇంటింటికీ తిరిగి డ్రాపౌట్ విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఇలా గుర్తించిన విద్యార్థులను దగ్గరలోని పాఠశాలల్లో చేర్పించారు. పిల్లలతో ఎవరైనా పని చేయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
జయశీల, ఎంఈవో, ఆదిలాబాద్