అమెరికా: అమెరికా ఇమ్మిగ్రేషన్ దరఖాస్తుల పరిశీలనకు సంబంధించి యూఎస్ ప్రభుత్వం నిబంధనలను మరింత కఠినతరం చేసింది. వీసా, గ్రీన్కార్డ్ లేదా ఇతర ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాల కోసం దాఖలు చేసిన దరఖాస్తులు అసంపూర్తిగా ఉంటే, మిస్సయిన పత్రాలను సమర్పించమని దరఖాస్తుదారులను మళ్లీ అడగకుండా నేరుగా తిరస్కరించే అధికారాన్ని ఇమ్మిగ్రేషన్ అధికారులకు కల్పించింది. ఈ నిర్ణయం వేలాదిమంది భారతీయ దరఖాస్తుదారులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నది. యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) జారీ చేసిన ఈ కొత్త మార్గదర్శకాలు ఆగస్టు 5 నుంచి లేదా ఆ తర్వాత దాఖలైన/పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నింటికీ తక్షణమే వర్తిస్తాయి.
గతంలో, బైడెన్ పరిపాలనా కాలంలో ప్రవేశపెట్టిన నిబంధనల ప్రకారం దరఖాస్తును తిరస్కరించే ముందు అధికారులు రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్(ఆర్ఎఫ్ఈ) లేదా నోటీస్ ఆఫ్ ఇంటెంట్ టు డినై(ఎన్వోఐడీ) జారీ చేయాలని సూచించేవారు. దీనివల్ల లోపాలను సరిదిద్దుకోవడానికి దరఖాస్తుదారులకు ఒక అవకాశం లభించేది. అయితే ఇకపై ఆ అవకాశం ఉంటుందనే గ్యారెంటీ లేదు. ప్రతి ఇమ్మిగ్రేషన్ ప్రయోజనానికి ఏయే డాక్యుమెంట్లు కావాలో దరఖాస్తు ఫారమ్, అధికారిక మార్గదర్శకాల్లోనే స్పష్టంగా పేర్కొనబడి ఉంటాయి. కాబట్టి దరఖాస్తుదారులు మొదటి నుంచే పూర్తి సమాచారంతో కూడిన దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
కొత్త మార్గదర్శకాలు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ నియంత్రణ అధికారాలకు అనుగుణంగా ఉన్నాయని, ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ పారదర్శకత, విశ్వసనీయతను బలోపేతం చేయడానికి ఉద్దేశించబడ్డాయని యూఎస్సీఐఎస్ పేర్కొంది. అసంపూర్తిగా ఉన్న దరఖాస్తుల వల్ల ఇతర కేసుల ప్రాసెసింగ్ ఆలస్యమవుతున్నదని ఏజెన్సీ పేర్కొంది. కొందరు దరఖాస్తుదారులు ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ వంటి తాత్కాలిక ప్రయోజనాలు పొందేందుకు “ప్లేస్హోల్డర్” దరఖాస్తులను వాడుతున్నారని తెలిపింది.
ఆర్ఎఫ్ఈ లేదా ఎన్వోఐడీ జారీ చేయకుండానే దరఖాస్తులను తిరస్కరించే విచక్షణాధికారాన్ని అధికారులకు తిరిగి ఇవ్వడం ద్వారా ప్రాసెసింగ్ వేగం పెరుగుతుందని యూఎస్సీఐఎస్ భావిస్తున్నది. దీంతో దరఖాస్తుదారులు మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. దరఖాస్తును సమర్పించడానికి ముందే అది పూర్తిగా ఉందో లేదో, కావాల్సిన అన్ని పత్రాలు జత చేశారో లేదో నిర్ధారించుకోవాలి. కీలకమైన డాక్యుమెంట్ మిస్ అయితే, మళ్లీ సమర్పించడానికి అవకాశం ఇవ్వకుండానే దరఖాస్తును తిరస్కరించే ప్రమాదం ఉన్నది.