హైదరాబాద్, సెప్టెంబర్ 15(నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డి గజ్వేల్ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేస్తున్నారని కార్పొరేషన్ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ సాధకుడు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంపై కాంగ్రెస్ గూండాలు పథకం ప్రకారమే మూకుమ్మడి దాడులకు తెగబడ్డారని ఆరోపించారు. రాష్ట్ర ఆత్మగౌరవంపై దాడి చేసేందుకు దాదాపు 100 గ్యాంగులుగా ఏర్పడి కాంగ్రెస్ క్రిమినల్స్ బయలుదేరారని, కేసీఆర్ నివాసానికి చేరుకొని విధ్వంసం సృష్టించేందుకు యత్నించిన కాంగ్రెస్ మూకలను అడ్డుకొన్న అమాయకులపై ఉద్దేశపూర్వకంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
సీఎం రేవంత్రెడ్డి స్వయంగా ప్రోత్సహించడంతోనే దుండగులు కేసీఆర్ నివాసంపై దాడికి తెగబడ్డారని విమర్శించారు. దాడులకు పాల్పడిన కాంగ్రెస్ మూకలపై మరూక్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని, పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారారని ధ్వజమెత్తారు. రేవంత్రెడ్డి శాశ్వతంగా సీఎం కుర్చీలో ఉండబోరని, భవిష్యత్తులో ఆయన పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు ఆయన ఇంటిపై కూడా ఇలాగే దాడులు చేయాలా? అని ప్రశ్నించారు. పోలీసులు తక్షణమే తమ వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు. పరిపాలన చేతకాకపోతే రాజీనామా చేసి తప్పుకోవాలని, ఇలాంటి అరాచక పాలనను ఏ భాషలో ప్రశ్నించాలో అర్థం కావడం లేదని ఆయన మండిపడ్డారు.
కేసీఆర్ నివాసం వద్ద డప్పులు కొట్టి దాడులకు పాల్పడింది కుంభం అనిల్కుమార్రెడ్డి, బీర్ల అయిలయ్య, ఆంక్షారెడ్డి లాంటి ఓసీ, బీసీ నాయకులేనని, ఎస్సీలు కాదని కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తేల్చిచెప్పారు. కేసీఆర్ను అంతమొందించేందుకు సీఎం రేవంత్రెడ్డి పెద్ద కుట్రలు పన్నారని ఆరోపించారు. కేసీఆర్ ఇంటిపై దాడి చేయడానికి వెళ్లింది కాంగ్రెస్ జెండాలు పట్టుకొన్న ఆ పార్టీ కార్యకర్తలే తప్ప దళితులు కారని స్పష్టంచేశారు. అసెంబ్లీ వేదికగా సీఎం అబద్ధాలాడుతూ, ఎస్సీ, ఎస్టీలను ముందుపెట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ సంక్షేమ ఫలాలు పొందిన దళితులు ఆయన ఇంటిపైకి ఎందుకు దాడికి వెళ్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ మూకల దాడులను అడ్డుకొన్న వారిపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి ఆ చట్టాన్ని రాజకీయ ఆయుధంగా మార్చుకొన్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని స్వార్థం కోసం దుర్వినియోగం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డిపైనే తక్షణమే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ కిషన్రావు, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్, బీఆర్ఎస్ నేతలు మాణిక్యం, బొమ్మెర రామమూర్తి, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.