ఎదులాపురం, జనవరి 30: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సీసీఐ ఫ్యాక్టరీ ప్రారంభించక పోతే ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని సీసీఐ సాధన కమిటీ కన్వీనర్, కో కన్వీనర్లు దర్శనాల మల్లేశ్, విజ్జగిరి నారాయణ స్పష్టంచేశారు. సీసీఐ పున :ప్రారంభించాలని చేపడుతున్న ఉద్యమంలో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని సీసీఐ ఫ్యాక్టరీ రోడ్డు సమీపంలో సీసీఐ సాధన కమిటీ సభ్యులు నల్లకండువాలు వేసుకుని ధర్నా చేశారు. సీసీఐపై కేంద్ర ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అన్ని ముడిసరుకు రోడ్డు, రైల్వే సౌకర్యం అందుబాటులో ఉన్న పరిశ్రమని మూసివేయడం సిగ్గుచేటని విమర్శించారు. 2022 కేంద్ర బడ్జెట్లో జిల్లాకు నిధులు కేటాయించకపోయి, సీసీఐ ప్రారంభించకపోయిన భారీ ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సీసీఐ ప్రారంభించానికి కేంద్ర ప్రభుత్వానికి, మంత్రులకు పలు మార్లు లేఖలు రాసినట్లు గుర్తుచేశారు. ఫిబ్రవరి 4న పట్టణ బంద్ నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో సీసీఐ సాధన కమిటీ సభ్యులు ఎం నర్సింగ్, కొండ రమేశ్, బండి దత్తాత్రి, అరవింద్, లంక రాఘవులు, బుట్టి శివకుమార్, భూ నిర్వాసితులు బొల్లు ఈశ్వర్, విఠల్, ప్రభ, మహిళ సంఘం నాయకురాలు మయూరి ఖాన్, సీఐటీయు జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్, అధ్యక్షుడు బొజ్జ ఆశన్న , సీపీఎం పట్టణ కమిటీ సభ్యులు లంక జమున , శకుంతల, నాయకులు ఉన్నారు.