ఆదిలాబాద్, జనవరి 26 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాగా ఉన్న ఆదిలాబాద్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి దిశగా దూసుకుపోతున్నది. ఏడేళ్లలో గణనీయంగా ప్రగతి సాధించిన ఆదిలాబాద్ జిల్లాలో ఐటీ విస్తరణకు బీజం పడింది. ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ రంగాన్ని విస్తరింపజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. జిల్లా కేంద్రంలో ఐటీ బిజినెస్ సర్వీస్ సెంటర్ను ప్రారంభించడానికి ఎన్డీబీఎస్ ఎండీ, సీఈవో సంజీవ్ దేశ్పాండే ముందుకు వచ్చారు. ఈ మేరకు ఆయన హైదారాబాద్లో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ను కలిశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్ ఆదిలాబాద్లో ఐటీ సెంటర్ ఏర్పాటు సంతోషకరమని, కంపెనీ ఏర్పాటుకు ప్రభుత్వం తరఫున అన్ని రకాల ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎమ్మెల్యే జోగు రామన్నను అడిగి తెలుసుకున్నారు. ఐటీ బిజినెస్ సర్వీస్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన సంజీవ్ దేశ్పాండేకు ఎమ్మెల్యే జోగు రామన్న జిల్లా ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు.
ముక్రా (కే)లో మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం
ఇచ్చోడ, జనవరి 26 : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఐటీ టవర్ ఏర్పాటుతో యువతకు ఉద్యోగాలతో పాటు ఉపాధి అవకాశాలు మరింత లభించనున్నాయని ముక్రా (కే) సర్పంచ్ గాడ్గె మీనాక్షి అన్నారు. జిల్లా కేంద్రానికి ఐటీ టవర్ మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం మండలంలోని ముక్రా (కే) యువకుల ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. యువతకు మంచి రోజులు రాబోతున్నాయని పేర్కొన్నారు. సర్పంచ్తో పాటు గ్రామానికి చెందిన యువతీ, యువకులు కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గాడ్గె సుభాష్, యువకులు గాడ్గె దీపక్, బాలాజీ, సునీల్, మారుతి, రవి, సంతోష్, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాకు సంతోషకరమైన వార్త మంత్రి కేటీఆర్ ట్వీట్
ఆదిలాబాద్లో ఎన్డీబీఎస్ సీఈవో సంజీవ్ దేశ్పాండే ఐటీ బిజినెస్ సర్వీస్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడంపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కంపెనీ సీఈవో సంజీవ్ దేశ్పాండేకు ధన్యవాదాలు తెలిపారు. సెంటర్ ఏర్పాటు జిల్లాకు సంతోషకరమైన వార్త అన్నారు. ఐటీ టవర్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి ట్విట్టర్లో పేర్కొన్నారు.