ఎదులాపురం,ఫిబ్రవరి15: న్యాయస్థానాల్లో కేసుల రుజువు శాతం పెంచడానికి కృషి చేయాలని ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. స్థానిక ఎస్పీ క్యాంపు కార్యాలయంలో కోర్టు విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన ఎస్పీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలో 20 పోలీస్ స్టేషన్లు ఉన్నాయని, ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఒక కానిస్టేబుల్ కోర్టు విధులకు హాజరవుతారని తెలిపారు. నిందితులపై చార్జీషీట్ దాఖలు చేయడం, సాక్షులను ప్రవేశ పెట్టడం, జిల్లా జైలు నుంచి నిందిలతను సమయాను సారంగా హాజరు పర్చడం, సమన్లు ఇవ్వడం, కోర్టుకు గైర్హాజరైన వారిపై వారెంట్లు తీసుకోవడం తదితర అంశాలపై రోజు వారి విధులు నిర్వహిస్తుంటారని వివరించారు. దర్యాప్తుకు సంబంధించిన దస్ర్తాలను సేకరించి పకడ్బందీగా చార్జీషీట్ దాఖలు చేసినప్పుడే నిందితులకు శిక్ష పడుతుందని చెప్పారు. జైళ్లలో ఉన్న నిందితులను వాయిదా అనుసారంగా న్యాయస్థానంలో హాజరు పర్చాలని గుర్తు చేశారు. డీసీఆర్బీలో కేసుల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ గుణవంత్రావు, ఎస్బీ సీఐ కృష్ణమూర్తి, ఎస్ఐ హకీం, ఐటీ కోర్ ఇంచార్జీ మురాత్, సీడీవోలు, సిబ్బంది పాల్గొన్నారు.