ఎదులాపురం, డిసెంబర్ 19 : ఉమ్మడి జిల్లా పోలీస్ అధికారులు, పీఈటీ, సాంకేతిక నిపుణుల సహకారంతో కొనసాగిన పోలీస్ అభ్యర్థుల ఈవెంట్స్ సోమవారం ముగిశాయి. మొత్తం 10,378 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా.. 9,178 మంది హాజరయ్యారు. 1200 మంది గైర్హాజరయ్యారు. అన్ని పరీక్షల్లో 4,780 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత పొంది తుది రాత పరీక్షకు అర్హత సాధించారు. ఇందులో 3,740 మంది పురుష, 1,040 మంది మహిళా అభ్యర్థులున్నారని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్కుమార్ రెడ్డి తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 3 గంటల నుంచి ప్రక్రియ పూర్తయ్యే వరకు మైదానంలో విధులు నిర్వర్తించిన ప్రతి ఒక్కరికీ ఆయన అభినందనలు తెలిపారు. విధులు నిర్వర్తించిన ప్రతి ఒక్క పోలీస్ అధికారికి ప్రశంసాపత్రం, గుడ్ సర్వీస్ రివార్డులను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. ఎంపిక ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా అత్యాధునిక పరికరాలు, సాంకేతికత ఉపయోగించినట్లు పేర్కొన్నారు. ప్రక్రియంతా సీసీ కెమెరాల నిఘాలో కొనసాగిందని చెప్పారు. ఎంపికైన అభ్యర్థులు తుది రాత పరీక్ష కోసం నిమిషం కూడా వృథా చేయకుండా కష్టపడి చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సీ సమయ్జాన్రావు, ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్, డీఎస్పీలు వెంకటేశ్వరరావు, వీ ఉమేందర్, ఎస్ సుందర్రావు, కే ప్రసాద్, సీహెచ్ నాగేందర్, పీ కృష్ణ ప్రసాద్, ఏ కరుణాకర్, పోలీస్ కార్యాలయం ఏవో యూనుస్ అలీ, సూపరింటెండెంట్లు జోసెఫిన్, గంగాధర్, సీ శ్రీనివాస్, కార్యాలయ సి బ్బంది, జిల్లాలోని సీఐ, ఆర్ఐ సీఐలు, ఎస్ఐలు, ఐటీ కోర్, ఫింగర్ప్రింట్, ట్రాఫి క్, కమ్యూనికేషన్, స్పెషల్ పార్టీ, క్యూఆర్టీ ఉమ్మడి జిల్లా పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.