ఆదిలాబాద్, డిసెంబర్ 19(నమస్తే తెలంగాణ) ;ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాగా ఉన్న ఆదిలాబాద్ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలితంగా ఇతర జిల్లాలతో పోటీ పడుతుంది. ప్రభుత్వం ఐటీ రంగానికి చేయూతనందిస్తుండడంతో ఐటీ పరిశ్రమలు ద్వితీయ శ్రేణి పట్టణాలకు విస్తరిస్తున్నాయి. గతంలో హైదరాబాద్, బెంగళూరు, పూణె లాంటి పట్టణాలకు పరిమితమైన ఐటీ పరిశ్రమలు ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాకు వస్తున్నాయి. సెప్టెంబర్ 26న జిల్లాలో పర్యటించిన రాష్ట్ర ఐటీ మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి ఆదిలాబాద్కు ఐటీ పార్కును మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే జిల్లాలో ఓ ఐటీ కంపెనీ ఉండగా ప్రభుత్వం కొత్తగా ఐటీహబ్ను నిర్మించనున్నది. మావల మండలం బట్టిసావర్గాంలో అధికారులు మూడు ఎకరాల స్థలాన్ని గుర్తించారు. జిల్లాలో ఐటీ రంగం అభివృద్ధి పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన జిల్లాగా ఉండేది. గత పాలకులు జిల్లాను విస్మరించడంతో అంతగా అభివృద్ధికి నోచుకోలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధిలో దూసుకుపోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు జిల్లా ప్రజల ఉపాధిని మెరుగుపర్చడమే కాకుండా.. ప్రజలకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నాయి. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం రాయితీలు కల్పిస్తున్నది. గతంలో హైదరాబాద్, బెంగళూరు, పూణె లాంటి పట్టణాలకే పరిమితమైన ఐటీ పరిశ్రమలు.. ఇప్పుడు మారుమూల ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లాకు విస్తరించాయి. ఆదిలాబాద్లో బీడీఎన్టీ ల్యాబ్ జిల్లా కేంద్రంలో ఉండగా.. ఇందులో జిల్లాకు చెందిన 120 మంది ఉద్యోగార్థులు పనిచేస్తున్నారు. పలు దేశాలకు చెందిన కంపెనీలతో కలిసి వీరు పని చేస్తున్నారు. జిల్లాకు చెందిన యువత ఉన్నత చదువులు చదువుకుంటూ.. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. స్థానికులు కూడా దేశ, విదేశాల్లో ఐటీ కంపెనీలు నడిపిస్తున్నారు. –
త్వరలో ఐటీ హబ్
సెప్టెంబర్ 26వ తేదీన మంత్రి కేటీఆర్ జిల్లాలో పర్యటించారు. పట్టణంలోని బీడీఎన్టీ ఐటీ కంపెనీని సందర్శించారు. కంపెనీ నిర్వాహకులు, ఉద్యోగులతో మాట్లాడారు. ఆదిలాబాద్ జిల్లాకు చెంది న యువత ఐటీ రంగంలో విదేశీ కంపెనీలతో కలిసి పనిచేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. వారి సమస్యలను తెలుసుకున్న మంత్రి విద్యుత్, ఇతర అవసరాల కోసం రూ.1.50 కోట్ల్లు అవసరమవుతుందని తెలుసుకొని వెంటనే నిధులు మంజూరు చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన మంత్రి కేటీఆర్ ఆదిలాబాద్లో ఐటీ పార్కును ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర ఐటీ శాఖ అధికారులు జిల్లాలో పర్యటించి ఐటీ హబ్ ఏర్పాట్లపై సమీక్షించారు. ఇందుకోసం మూడెకరాల స్థలం కేటాయించాలని కలెక్టర్ను కోరారు. ఈ మేరకు మావల మండలం బట్టిసావర్గాంలోని సర్వే నంబరు 72లో భూమి కేటాయిస్తున్నట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు.
పలు రకాల ప్రయోజనాలు
ఆదిలాబాద్లో ఐటీ హబ్ ఏర్పాటు వల్ల ఉమ్మడి జిల్లా ప్రజలకు పలు రకాల ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వారు విదేశాల్లో ఐటీ కంపెనీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం టీఎస్ ఐపాస్లో భాగంగా పరిశ్రమలకు పలు రాయితీలు కల్పిస్తుండడంతో వారు జిల్లాలో కంపెనీలు ప్రారంభించే అవకాశాలున్నాయి. జిల్లాకు చెందిన యువత ఉన్నత చదువులు చదివి హైదరాబాద్, బెంగళూరు, పుణె లాంటి పట్టణాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి స్థానికంగా ఐటీ కంపెనీల్లో మంచి ఉద్యోగాలు సాధించవచ్చు. స్థానికంగా ఉండడంతో వారికి ఖర్చులు బాగా మిగులుతాయి. జిల్లాకు చెందిన ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. మంత్రి కేటీఆర్ కృషి వల్ల ఉన్నత చదువులు చదువుకున్న తమకు స్థానికంగా ఉద్యోగాలు లభిస్తాయని యువత అంటున్నారు.
ఐటీ హబ్తో యువతకు ఉపాధి
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గడపగడపకూ అందుతున్నాయి. ప్రస్తుతం జిల్లా ప్రజల ఉపాధి ఎంతో మెరుగుపడింది. ఆదిలాబాద్లో ఐటీ రంగం విస్తరించడం అభినందనీయం. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషితో జిల్లాలో ఐటీ కంపెనీ ఏర్పాటు కావడంతో పాటు ఐటీ హబ్ కూడా ప్రారంభం కానుంది. ఇందుకోసం మూడెకరాల స్థలం గుర్తించారు. ఐటీ హబ్ ఏర్పాటుతో నిరుద్యోగులు, యువతకు ఉద్యోగాలు లభించడంతో పాటు స్థానికంగా పనిచేస్తారు. వివిధ దేశాల్లో ఉన్న జిల్లాకు చెందిన ఐటీ కంపెనీల యజమానులు ఇక్కడ పరిశ్రమలు స్థాపించే అవకాశం ఉంది.
– జోగు ప్రేమేందర్, మున్సిపల్ చైర్మన్, ఆదిలాబాద్
స్థానికంగా ఉద్యోగాలు చేయవచ్చు
రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించడం కోసం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టింది. దీంతో నిరుద్యో గులకు గ్రూప్-1 నుంచి గ్రూప్-4 వరకు వారి అర్హతల మేరకు ఉద్యోగాలు సాధించే అవకాశం లభించింది. రాష్ట్రంలో ఐటీ రంగం బాగా విస్తరించింది. ప్రభుత్వం ఆదిలాబాద్లో ఐటీ హబ్ను ఏర్పాటు చేయడం ఎంతో ప్రశంసనీయం. ఉన్నత చదువులు చదువుకొని హైదరాబాద్, బెంగళూర్, పూణె లాంటి నగరాల్లో ఐటీ ఉద్యోగాలు చేసే యువత ఇప్పుడు వారి సొంత జిల్లాల్లోనే మంచి ఉద్యోగాలు చేసే అవకాశం లభిస్తుంది.
– సాయి కిరణ్, యువకుడు, ఆదిలాబాద్
నిరుద్యోగులకు ఉపాధి
రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాల ఫలితంగా ఎనిమిదిన్నర ఏండ్లుగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. ఐటీ, ఇతర రంగాల్లో సైతం యువతకు ఉద్యోగాలు దొరుకుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో చాలా మంది యువకులు ఐటీ లో రాణిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వం ఐటీ హబ్ను ఏర్పాటు చేస్తుడడంతో స్థానికులు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయి.
–ప్రశాంత్, యువకుడు ఆదిలాబాద్
జిల్లా యువతకు మంచి అవకాశం
పట్టణాలకే పరిమితమైన ఐటీ పరిశ్రమలు వివిధ ప్రాంతాలకు విస్తరించడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ కృషి ఎంతో ఉంది. ఐపాస్ విధానం, పరిశ్రమలకు పలు రాయితీలు కల్పిస్తుండడంతో ఐటీ కంపెనీలు నెలకొల్పడానికి యజమానులు ఆసక్తి చూపుతున్నారు. ఆదిలాబాద్లో ఐటీ హబ్ ఏర్పాటు చేయడం జిల్లా యువతకు వరంగా మారింది. ఐటీ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న యువతకు ఇది మంచి అవకాశం. రానున్న రోజుల్లో ఐటీ కంపె నీల రాక పెరిగితే, జిల్లా ముఖచిత్రం మరింత మారే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే జోగు రామన్న కృషి వల్లే ఇది సాధ్యమవుతున్నది. నిరుద్యోగ యువతకు భరోసానిచ్చేలా ఐటీ హబ్లను ఏర్పాటు చేయడం హర్షణీయం.
–షేక్ ఫిర్ధోస్, ఆదిలాబాద్