సారంగాపూర్, డిసెంబర్ 17: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎక్కువగా పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులే చదువుతున్నారు. ప్రతిభ ఉన్నా సరైన ప్రోత్సాహం, శిక్షణ లేక వైద్య విద్య, ఇంజినీరింగ్ కోర్సులకు ఎంపిక కాలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ను తీర్చిదిద్ది, వారి కలలు సాకారం చేసేలా ఇంటర్మీడియట్ బోర్డు కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని సెకండియర్ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఎంసెట్, నీట్కు సంబంధించి ఉచితంగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ఏడాది వార్షిక పరీక్షలు ముగిసిన వెంటనే రెండు నెలల పాటు నిష్ణాతులైన అధ్యాపకుల ఆధ్వర్యంలో ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. ఈ మేరకు కళాశాలల వారీ గా విద్యార్థుల వివరాలు సేకరించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పేద కుటుంబాల్లోని పిల్లలకు ప్రయోజనం చేకూరుతుంది. కాగా హైదరాబాద్కు వెళ్లి ఒక్కో విద్యార్థి రెండు, మూ డు నెలల పాటు ఎంసెట్ కోచింగ్కు సుమారు రూ. 50వేలు, నీట్కు రూ. 70వేల దాకా ఖర్చు అవుతున్నదని కొందరు అధ్యాపకులు అంటున్నారు. కానీ ప్రభుత్వం ఈ కోచింగ్ను ఉచితంగా ఇవ్వడంతో తల్లిదండ్రులకు ఆర్థిక భారం తప్పనుంది.
గైర్హాజరుతో పడిపోతున్న ఉత్తీర్ణత…
ప్రభుత్వ కళాశాలల్లో విద్యా ప్రమాణాలు ఏటేటా పడిపోతుండడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుతో పాటు వ్యవసాయం, ఇతర ఇంటి పనులు చేయాల్సి వస్తుండంతో ఉత్తీర్ణత శాతం పడిపోతున్నది. బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్న గైర్హాజరు పెరుగుతుండడం ఇబ్బందికరంగా మారింది. ఉచిత పాఠ్యపుస్తకాలు, ప్రవేశ రుసుము లేకపోవడంతో పేద విద్యార్థులకు ఆర్థికంగా కొంత వెసులుబాటుతో ప్రవేశాలు పెరుగుతున్నాయి.
జిల్లా కేంద్రంలో కోచింగ్
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ చదువుతున్న సెకండియర్ విద్యార్థుల వివరాలు సేకరించారు.
విద్యార్థుల్లో ఉత్సాహ వంతులైన వారిని ఎంపిక చేస్తున్నారు.
జిల్లా కేంద్రంలో ఒకే చోట శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.
ప్రతిభావంతులైన అధ్యాపకులతో ఎంసెట్, నీట్లో రెండు నెలల పాటు కోచింగ్ ఇవ్వనున్నారు.
విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఇంటర్మీడియట్ బోర్డు స్టడీ మెటీరియల్ సరఫరా చేస్తుంది.
1041 మందికి ప్రయోజనం…
నిర్మల్ జిల్లాలో 12 ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న 398 మంది ఎంపీసీ, 641 మంది బైపీసీ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ప్రైవేట్ శిక్షణ కేంద్రాల్లో చేరి సన్నద్ధమవుతున్న విద్యార్థులు ఏటా మంచి ర్యాంకులు సాధిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ప్రతిభ ఉన్నా అది సాధ్యం కావడం లేదు. ఈ సారి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని విద్యార్థులకు మెరుగైన ఎంసెట్, నీట్ కోచింగ్ ఇవ్వాలని ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ జీవో జారీ చేయడంతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గనుంది. డిసెంబర్ నెలాఖరులోగా సిలబస్ పూర్తిచేసి జనవరి ఒకటి నుంచి ఫిబ్రవరి వరకు జూనియర్ కళాశాలల్లో కోచింగ్ ఇచ్చి మార్చిలో వార్షిక పరీక్షలు ముగిసిన అనంతరం ఎంసెట్, నీట్ కోచింగ్కు జిల్లా స్థాయిలో పరీక్ష నిర్వహించి ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
మంచి నిర్ణయం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పేద విద్యార్థులే చదుతున్నారు. ప్రతిభ ఉన్నా పేద డబ్బుల కొరత మూలంగా ఎంసెట్, నీట్ కోచింగ్ తీసుకోవడానికి విద్యార్థులు వెనుకడుగు వేస్తున్నారు. ఇంటర్మీడియట్ బోర్డు ఈ ఏడాది నుంచి ప్రభుత్వ కళాశాలల్లో ఎంసెట్, నీట్లో కోచింగ్ ఇవ్వడం అభినందనీయం. ఉచిత శిక్షణతో పేద విద్యార్థులు ఎంతో మేలు జరుగుతుంది.
పీ లక్ష్మి, ఎంపీసీ, సారంగాపూర్ జూనియర్ కళాశాల
త్వరలో స్టడీ మెటీరియల్ సరఫరా…
ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు కలలు సాకారం చేసుకునే సువర్ణ అవకాశం వచ్చింది. బైపీసీ, ఎంపీసీ గ్రూపులకు చెందిన విద్యార్థుల వివరాలను ప్రభుత్వానికి సమర్పించాం. ఇంటర్ బోర్డు త్వరలో స్టడీ మెటీరియల్ సరఫరా చేయనుంది. జనవరి ఒకటి నుంచి జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అధ్యాపకులతో ఎంసెట్, నీట్కు కోచింగ్ ప్రారంభం అవుతుంది. వార్షిక పరీక్షలు ముగిసిన తర్వాత అన్ని కళాశాలల విద్యార్థులకు పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణత సాధించిన వారికి శిక్షణ ఇస్తాం. ఈ కోచింగ్ జిల్లా కేంద్రంలోనే ఉంటుంది. ఉచిత కోచింగ్తో మూలంగా విద్యార్థుల్లో పోటీ తత్వం కూడా పెరుగుతుంది.
జాదవ్ పరశురాం, నోడల్ అధికారి, నిర్మల్ జిల్లా