భైంసాటౌన్, ఫిబ్రవరి 11 : సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజల కోసం ప్రతీ అవసరానికి ఒక పథకం అమలుచేస్తున్నారని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం 167 మంది లబ్ధిదారులకు రూ.1.67 కోట్ల విలువైన కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం అందని గడపలేదని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ సాధనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకూ సముచిత స్థానం ఉంటుందన్నారు. అలాగే శనివారం భైంసా పట్టణంలో 188 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఈ ఏడాది మార్చి వరకు వివిధ రకాల పింఛన్లను అందజేస్తామని, అర్హులైన వారికి ఇండ్లను కూడా కట్టిస్తామని తెలిపారు. ఇంకా 120 కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. లబ్ధిదారులు ఆలస్యంగా దరఖాస్తు చేసుకోవడంవల్లే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కల్పన జాదవ్, ఆర్డీవో లోకేశ్వర్ రావు, తహసీల్దార్ విశ్వంబర్, ఎంపీడీవో గంగాధర్, ఆర్ఐ ప్రవీణ్, వైస్ ఎంపీపీ గంగాధర్, కోఆప్షన్ సభ్యుడు గజానంద్, టీఆర్ఎస్ నాయకులు రాంకుమార్, గణేశ్ పాటిల్, ముత్యం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రెడ్డి, కుంసర, సిరాల, ఇలేగాం, హంపోలి, మహాగాం, లింగా గ్రామాల సర్పంచ్లు ప్రవీణ్, సతీశ్, ముత్యం, ప్రసాద్, నాయకులు పోతన్న, రాకేశ్, గణేశ్, నాయకులు సంజీవ్, మేరాజ్, సోలంకి భీంరావు, రమేశ్, హన్మండ్లు తదితరులు పాల్గొన్నారు.
కుభీర్ మండలకేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో 196 మంది లబ్ధిదారులకు రూ.1.96 కోట్ల విలువ గల కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే పంపిణీ చేశారు. గిరిజనుల ఆరాధ్యదైవం సేవాలాల్ మహరాజ్ ఆలయ నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేశారని గుర్తుచేశారు. 25వ తేదీన మంత్రి అల్లోల భూమిపూజ చేయనున్నారని పేర్కొన్నారు. అనంతరం 12 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు(రూ.8లక్షలు) అందజేశారు. అంతకుముందు ఇటీవల మృతిచెందిన బేంద్రి మాధన్న, కందూరి సాయమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట సర్పంచ్ పానాజీ మీర విజయ్కుమార్, జడ్పీటీసీ అల్కాతాయి సంజయ్ చౌహాన్, మాజీ జడ్పీటీసీ శంకర్ చౌహాన్, రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ రేకుల గంగాచరణ్, పార్టీ మండలాధ్యక్షుడు ఎన్నీల అనిల్, జిల్లా ప్రధాన కార్యదర్శి తూం రాజేశ్వర్, వైస్ ఎంపీపీ మోహియొద్దీన్, కుప్టి రమేశ్, బొప్ప నాగలింగం, సూది రాజన్న, శ్రీరాముల రాజేశ్, ఆకుల గంగాధర్, తహసీల్దార్ సుభాష్ చందర్, ఆర్డీవో రాథోడ్ రమేశ్, నాయకులు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.