నిర్మల్, డిసెంబర్ 16(నమస్తే తెలంగాణ):నిర్మల్ జిల్లాలోని చారిత్రక దేవాలయాలకు మహర్దశ చేకూరుతున్నది. మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ప్రత్యేక చొరవతో జిల్లాలో సుమారు 600కు పైగా ఆలయాల పునర్నిర్మాణం, కొత్త ఆలయాల నిర్మాణం పూర్తయ్యింది. ఉమ్మడి రాష్ట్రంలో చారిత్రక ఆలయాలన్నీ నిర్లక్ష్యానికి గురవగా, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సర్కారు వాటికి వైభవం తెస్తున్నది. నిర్మల్ జిల్లా ఆధ్యాత్మిక ప్రాంతంగా రోజురోజుకూ విస్తరిస్తుండగా, భక్తుల కోరిక మేరకు రాష్ట్ర సర్కారు నిధులు మంజూరు చేస్తున్నది.
ఉమ్మడి రాష్ట్రంలో కనీస మరమ్మతులకు నోచుకో క చాలా ఆలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. అప్పట్లో పురాతన ఆలయాల అభివృద్ధి కోసం స్థానికులు చేసిన విజ్ఞప్తులన్నీ బుట్టదాఖలయ్యా యి. ఇక్కడి చారిత్రక ఆలయాలను ఏమాత్రం పట్టించుకోని నాటి ప్రభుత్వాలు సాధారణ జనాన్ని ఆధ్యాత్మికతకు సైతం దూరం చేశాయి. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టడంతో రాష్ట్రంలోని అన్ని ఆలయాలపై సర్కారు దృష్టి సారించింది. ముందుగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని మరో తిరుపతిగా తీర్చిదిద్దిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తన శాఖ పరిధిలో జిల్లాలోని ఆలయాల పునర్నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. దీని కారణంగానే గత ఏడేళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో దాదాపు 600 ఆలయాల పునర్నిర్మాణంతో పాటు, నూతన ఆలయాల నిర్మాణాలు పూర్తయ్యాయి. నిర్మల్ జిల్లాలో అడెల్లి మహా పోచమ్మ ఆలయంతోపాటు, కాల్వ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, బూరుగుపల్లి రాజరాజేశ్వరాలయం, కదిలి పాపహరేశ్వర ఆలయమే కాకుండా ముఖ్యమైన బాసర సరస్వతీదేవి ఆలయాలకు ప్రతిరోజూ భక్తులు వేలాది సంఖ్యలో వస్తుంటారు. దీనిని దృష్టిలో పెట్టుకొని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ముందుగా బాసర సరస్వతీదేవి ఆలయానికి మాస్టర్ ప్లాన్ కింద రూ.50 కోట్లు మంజూరు చేయించారు.
ఆ తర్వాత రూ.2 కోట్ల నిధులతో కాల్వ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని పునర్నిర్మించారు. ఇలా క్రమంగా పాత ఆలయాల పునర్నిర్మాణాలు, అవసరమైన చోట కొత్త ఆలయాల నిర్మాణానికి మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఎప్పటికప్పుడు నిధులను మంజూరు చేస్తూ వస్తున్నారు. అయితే మరో సమ్మక్క సారలమ్మగా ఈ ప్రాంతంలో పిలుచుకునే అందరి ఇలవేల్పు అడెల్లి మహాపోచమ్మ ఆలయాన్ని వినూత్న రీతిలో నిర్మించేందుకు మంత్రి తన వంతు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అడెల్లి మహాపోచమ్మ ఆలయానికి ప్రతి ఆదివారం, మంగళ, బుధవారాల్లో వేలాదిగా భక్తులు తరలి వచ్చి తమ మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. జిల్లా నుంచే కాకుండా పొరుగున ఉన్న ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు సరిహద్దున గల మహారాష్ట్ర నుంచి కూడా వేలాది సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ప్రతి ఆదివారం అడెల్లి పోచమ్మ ప్రాంతంతో పాటు సారంగాపూర్, నిర్మల్ ప్రాంతాలన్నీ అక్కడికి వచ్చే భక్తులతో కిటకిటలాడుతుంటాయి. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుండడంతో ఆదాయం కూడా ఆశించిన విధంగానే వస్తున్నది.
అయితే అడెల్లి మహా పోచమ్మ ఆలయం మొదటి నుంచి పాలకుల నిర్లక్ష్యానికి గురవుతూ వచ్చింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇటీవల ఇక్కడి ఆలయాన్ని కొంతమేరకు ఆధునీకరించారు. అయితే మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం మరింతగా విస్తరించాలన్న ఉద్దేశంతో అడెల్లి మహాపోచమ్మ ఆలయ రూపురేఖలను పూర్తిగా మార్చేందుకు నిర్ణయించారు. దీని కోసం గాను రూ.10కోట్లను ఆయన మంజూరు చేశారు. ఈ నిధులతో ఆలయాన్ని మరింత విస్తరించనున్నారు. భక్తులకు అవసరమైన సదుపాయాలను కల్పించడంతో పాటు అన్ని హంగులతో ఆలయాన్ని పునర్నిర్మించనున్నారు. కాగా ఇందుకు సంబంధించిన పనులకు ఇటీవలే మంత్రి ఇంద్రకరణ్రెడ్డి శంకుస్థాపన చేశారు. యాదాద్రి తరహాలోనే పూర్తిగా కృష్ణ శిలలతో నిర్మించేందుకు మాస్టర్ ప్లాన్ను రూపొందించారు. గర్భాలయంలోని అమ్మవారి విగ్రహం మినహా దేవాలయాన్ని పూర్తిగా ఆధునీకరించనున్నారు.
దాదాపు రూ. 6. 60 కోట్లతో గర్భగుడి, అర్థమండపం, అనివేటి మండప నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే మరో కోటి రూపాయలతో రాజగోపురం, రూ. 60 లక్షలతో ఆలయ ప్రాంగణం చుట్టూ ఫ్లోరింగ్, రూ. 40 లక్షలతో భక్తుల కోసం వసతి గృహాలను ప్రత్యేకంగా నిర్మించనున్నారు. దీంతోపాటు కోనేరు ఆధునీకరణకు రూ.40 లక్షలు, షాపింగ్ కాంప్లెక్స్ కోసం రూ. కోటి ఖర్చు చేయనున్నారు. ఆలయానికి 24 గంటల పాటు విద్యుత్ను సరఫరా చేసేందుకు ప్రత్యేక విద్యుత్ లైన్ను, మిషన్ భగీరథ నీటిని అందించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఏడాదిలోగా మొత్తం ఆలయాన్ని పునర్నిర్మించి భక్తులకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే బాసర సరస్వతీ అమ్మవారి సన్నిధిలో అభివృద్ధి పనులు కొనసాగుతుండగా, కాల్వ లక్ష్మీ నరసింహాస్వామి ఆలయ పనులు పూర్తయ్యాయి. అలాగే కదిలి పాపహరేశ్వరాలయం, బూరుగుపల్లి రాజరాజేశ్వరాలయం, బాబాపూర్ శివాలయం పనులు కూడా త్వరలోనే ప్రారంభం కానున్నాయి. నిర్మల్లోని పురాతన దేవరకోట వేంకటేశ్వరాలయాన్ని కూడా ఇప్పటికే ఆధునీకరించారు. ఇక అడెల్లి మహాపోచమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తయితే ఈ ప్రాంతమంతా ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రంగా వర్ధిల్లనున్నది.
మంత్రి అల్లోల కృషి వల్లే..
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ప్రత్యేక కృషితోనే ఆలయ పునర్నిర్మాణానికి పెద్ద మొత్తంలో నిధులు మంజూరయ్యాయి. ఇప్పటికే ఆయన ఆలయ అభివృద్ధికి పలుమార్లు నిధులు మంజూరు చేశారు. ఈ సారి ఏకంగా యాదాద్రి తరహాలో ఆలయ రూపురేఖలను మార్చేందుకు రూ.10 కోట్లు మంజూరు చేయించడం విశేషం. గతంలో ఈ ఆలయం ఎంతో నిర్లక్ష్యానికి గురైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవతోనే ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్నది. భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న కారణంగా వారికి అవసరమైన మేర సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
–అయిటి చందు, చైర్మన్, అడెల్లి మహాపోచమ్మ ఆలయం