ఎదులాపురం/ఇచ్చోడ/ఉట్నూర్ రూరల్/నిర్మల్ చైన్గేట్, డిసెంబర్ 14 : భారతదేశ చరిత్రలో మరో అపూర్వఘట్టానికి తెరలేసింది. నవశకం ప్రారంభమైంది. కేసీఆర్ సాహసోపేత నిర్ణయంతో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్), భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా రూపాంతరం చెందింది. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెడ్లలా పరుగులు తీస్తుండగా.. దేశాన్ని ప్రగతిపథంలో నడిపించేందుకు నాంది పలికారు. డిసెంబర్ 9వ తేదీన బీఆర్ఎస్గా మార్చేందుకు ఎన్నికల సంఘం ఆమోదించినట్టు మెస్సేజ్ రావడంతో బుధవారం ఢిల్లీలోని సర్దార్ పటేల్ రోడ్డులో పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ఉమ్మడి జిల్లా నుంచి మంత్రి అల్లోల, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, గులాబీ శ్రేణులు పాల్గొన్నారు. కాగా.. స్థానికంగా కూడా మిఠాయిలు పంచుకున్నారు. మహారాష్ట్రలోని కిన్వట్ నియోజకవర్గంలో గల పాటోదా గ్రామస్తులు సీఎం కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ పార్టీకి తమ మద్దతు ప్రకటించారు.
ఢిల్లీలోని సర్ధార్ పటేల్ రోడ్డులో బుధవారం భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) జాతీయ పార్టీ కార్యాలయాన్ని గులాబీ బాస్, సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నలుమూలల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు హాజరయ్యారు. మంగళవారమే రైళ్లలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం, పూర్ణాహుతి, రాజశ్యామల యాగానికి హాజరయ్యారు. పాల్గొన్నవారిలో అటవీ, పర్యావరణ,న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్నేతకాని, ఎమ్మెల్సీ విఠల్, ఎమ్మెల్యేలు బాపురావు, దివాకర్రావు, కోనప్ప, సక్కు, రామన్న, చిన్నయ్య, విఠల్రెడ్డి, జడ్పీ చైర్మన్స్ కోవ లక్ష్మి, రాథోడ్ జనార్దన్, డీసీసీబీ చైర్మన్ భోజరెడ్డి, మాజీ ఎంపీ నగేశ్, మాజీ ఎమ్మెల్సీ సతీశ్, మా ర్కెట్ కమిటీ చైర్మన్ సమ్మయ్య, ఎంపీపీ మంత్రి బాపు, జడ్పీటీసీ తిరుపతి, మున్సిపల్ వైస్ చైర్మన్ నవాజొద్దీన్, వైస్ ఎంపీపీ బాపురెడ్డి, కౌన్సిలర్లు, సోషల్ మీడియా నాయకులు, మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు. కాగా.. నిర్మల్ పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణులు మిఠాయిలు పంచుకున్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన బీఆర్ఎస్ నాయకులు నాగాలాండ్ మాజీ మంత్రి ఎస్ లోతాను మర్యాద పూర్వకంగా కలిశారు. అలాగే మందమర్రి పట్టణానికి చెందిన మహిళా నాయకురాళ్లు సంబురాలు చేసుకున్నారు.
బీఆర్ఎస్కు జై కొట్టిన పాటోదా గ్రామస్తులు
మహారాష్ట్రలోని కిన్వట్ నియోజకవర్గంలో గల పాటోదా గ్రామస్తులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ పార్టీకి తమ మద్దతు ప్రకటించారు. పాటోదా గ్రామస్తులు తెలంగాణలోని ముక్రా(కే) గ్రామాన్ని గతంలో సందర్శించారు. కేసీఆర్ నాయకత్వంలో ముక్రా (కే) గ్రామం చాలా అభివృద్ధి చెందిందని, తెలంగాణ లాంటి పథకాలు తమకు కావాలని అన్నా రు. కేసీఆర్ ప్రధానమంత్రి అయితే తమకు కూడా తెలంగాణ లాంటి పథకాలు వస్తాయని వా రు పేర్కొంటున్నారు. కేసీఆర్ చిత్రపటం వద్ద ‘జై కేసీఆర్, ఆబ్కీ బార్ కిసాన్ సర్కార్’ అంటూ నినాదాలు చేశారు. తాము బీఆర్ఎస్ వెంటనే ఉంటామని, కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తామని ఘంటాపథంగా పేర్కొంటున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తంరావు, బిక్కు నాగోరావు, ఉమాజి కెరలె, గోపినాథ్, సురొసె పాల్గొన్నారు.