నిర్మల్ అర్బన్, డిసెంబర్ 6 : అంబేద్కర్ ఆశయాలు సాధించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని ధర్మసాగర్ ట్యాంక్బండ్ వద్ద గల విగ్రహానికి మంగళవారం పూలమాల వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో అన్ని రాష్ర్టాల కంటే అంబేద్కర్కు గౌరవం ఇచ్చింది సీఎం కేసీఆరేనని అన్నారు. రూ.600 కోట్లతో నిర్మించిన తెలంగాణ నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరుపెట్టారని తెలిపారు. దాని పక్కనే 125 అడుగుల భారీ అంబేద్కర్ పంచలోహ విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, సీనియర్ నాయకులు ముడుసు సత్యనారాయణ, కౌన్సిలర్లు బిట్లింగ్ నవీన్, నరేందర్, నల్లూరి పోశెట్టి, దళిత సంఘ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో..
ఎదులాపురం, డిసెంబర్ 6 : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్సీ కార్యాలయ ఆవరణలో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్తో కలిసి కలెక్టర్ సిక్తా పట్నాయక్ పూలమాల వేసి, నివాళులర్పించారు. అలాగే జ్యోతి బాఫూలే దంపతులు, జగ్జివన్రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని యువత నూతన ఒరవడిని సృష్టించాలని పిలుపునిచ్చారు. అనంతరం బోథ్ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆలోచనలు, స్ఫూర్తిని తీసుకొని చిన్న రాష్ర్టాలను ఏర్పాటు చేసుకొని పాలన సాగిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, డీఎస్సీడీవో భగత్ సునీత కుమారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, ఆయా సంఘాల నాయకులు, అధికారులు, ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో..
నిర్మల్ టౌన్, డిసెంబర్ 6 : నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించారు. ఎస్పీ ప్రవీణ్కుమార్తో కలిసి కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, అధికారులు తుకారాం, లోకేశ్వర్రావు, రాజశేఖర్, హన్మాం డ్లు, జీవన్రెడ్డి, దేవేందర్రెడ్డి, విజయలక్ష్మి, తిరుమల, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు విస్తరణ పనుల పరిశీలన..
కలెక్టర్ కార్యాలయ సమీకృత భవనం వద్ద అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులను అదనపు కలెక్టర్లతో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. పనులు త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతిరోజూ పనులను పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో స్రవంతి, తహసీల్దార్లు సుభాష్చందర్, ప్రభాకర్, ఆర్అండ్బీ ఈఈ అశోక్, పంచాయతీరాజ్ అధికారులు తుకారాం, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఈవీఎం గోదాముల పరిశీలన…
ఎల్లపెల్లి శివారు ప్రాంతంలోని కలెక్టర్ కార్యాలయ సమీపంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇం డియా ఆదేశాల మేరకు ఈవీఎం గోదాములను కలెక్టర్ పరిశీలించారు. ఈవీఎం యంత్రాలు, వీవీప్యాట్స్ భద్రపరిచిన స్ట్రాంగ్రూంను పరిశీలించి, భద్రత సిబ్బందికి సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ రాంబాబు, సిబ్బంది ఉన్నారు.