సారంగాపూర్, డిసెంబర్ 6 : అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. సారంగాపూర్ మండలం బోరిగాం గ్రామంలో నూతనంగా నిర్మించిన బీరప్ప, భీమన్న, శివుడి ఆలయాలను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.45వేల కోట్లు వెచ్చించి మిషన్ భగీరథ పనులు పూర్తి చేసి, ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నదన్నారు. రూ.1200 కోట్లతో అక్కాపూర్ వద్ద 400 కేవీ సబ్స్టేషన్ మంజూరు చేసి, పూర్తి చేసినట్లు, సారంగాపూర్ మండల కేంద్రంలో రూ.21 కోట్ల వ్యయంతో 132 కేవీ సబ్స్టేషన్ నిర్మించుకున్నట్లు చెప్పారు. సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షలు మంజూరు చేయనున్నదని, అందుకు నిర్మల్ నియోజకవర్గానికి 3 వేల ఇండ్లు వస్తున్నట్లు వెల్లడించారు. నిర్మల్ ప్రాంతంలో ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు 450 పడుకల దవాఖాన, మెడికల్ కాలేజీ, దళితబంధు ద్వారా నిర్మల్కు 1500 యూనిట్లు మంజూరయ్యాయన్నారు.
కుస్లీ గ్రామంలో మహాలక్ష్మి దేవాలయానికి రూ.25లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా బోరిగాం నుంచి జామ్ వరకు రోడ్డు సరిగా లేదని గ్రామస్తులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అందుకు మంత్రి స్పందిస్తూ.. రోడ్డు నిర్మాణానికి రూ.35 లక్షలు, వేంకటేశ్వర ఆలయానికి రూ. 10 లక్షలు, రెడ్డి కమ్యూనిటీ హాలుకు రూ.10 లక్షలు, మిగిలిపోయిన 20 శాతం సీసీ రోడ్లకు నిధులు, కొత్తగా సబ్స్టేషన్, ఇరిగేషన్ కాలువలకు డ్రైనేజీలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఒక్క దేవాలయం మంజూరవ్వాలంటే 25 శాతం కాంట్రిబ్యూషన్ కట్టాల్సి ఉండేదని, ప్రస్తుతం రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వం భరిస్తుందన్నారు. అనంతరం ఆలయాల్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అలాగే కుర్మ కులస్తులు మంత్రికి గొంగడి కప్పి గొర్రెపిల్లను అందించారు.
ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి మొక్కలు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు కో ఆర్డినేటర్ నల్లా వెంకట్రాంరెడ్డి, జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్రెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్రెడ్డి, అడెల్లి పోచమ్మ ఆలయ కమిటీ చైర్మన్ అయిటి చందు, డీసీసీబీ డైరెక్టర్ అయిర నారాయణరెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ కొత్తపెల్లి మాధవరావు, సర్పంచుల సంఘం అధ్యక్షుడు రవీందర్రెడ్డి, సర్పంచ్ చిన్నోల్ల రాజారెడ్డి, ఎంపీటీసీలు సిద్ధాపూర్ సురేఖ, శ్రీనివాస్యాదవ్, కో ఆప్షన్ మెంబర్ ఇస్మాయిల్, మాజీ మార్కెట్ చైర్మన్ వంగ రవీందర్రెడ్డి, అడెల్లి పోచమ్మ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ నాగుల రాంరెడ్డి, ఆలూర్ సొసైటీ చైర్మన్ లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు సురేశ్, నాయకులు దేవిశంకర్, లింగారెడ్డి, నాగుల నారాయణరెడ్డి, సాగర్రెడ్డి, భూమేశ్, ఎంపీడీవో సరోజ, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగు రవికిషన్గౌడ్, ఏఈ రామారావు తదితరులు పాల్గొన్నారు.
సేవ చేసి మంచి పేరు తెచ్చుకోండి..
నిర్మల్ టౌన్, డిసెంబర్ 6 : జిల్లాలోని అధికారులు ప్రజలకు మంచి సేవలు అందించినప్పుడే గుర్తింపు పొందుతారని, అందుకు కృషి చేయాలని మంత్రి సూచించారు. జిల్లా ల్యాండ్ రికార్డు సర్వే జిల్లా అధికారిగా బాధ్యతలు చేపట్టిన రాథోడ్ సుదర్శన్.. మంత్రితో పాటు కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీని కలిశారు. పుష్పగుచ్ఛాలు అందించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది ఉన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత..
నిర్మల్ అర్బన్, డిసెంబర్ 6 : నిర్మల్ నియోజకవర్గంలోని వివిధ అనారోగ్యాలతో బాధపడుతూ చికిత్స పొందిన వారికి మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి అందజేశారు. పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ అండగా నిలిస్తున్నదని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులున్నారు.