కుభీర్, డిసెంబర్ 6 : చదువుల్లో సరస్వతీ దేవి.. కానీ, నిరుపేద కుటుంబం. ఉన్నతంగా చదివి పేదలకు సేవ చేయాలనే ఆశ.. కూలీ పనిచేస్తే గానీ గడవని జీవనం. పెద్ద కళాశాలలో ఎంబీబీఎస్ సీటు.. పెద్ద మొత్తం ఖర్చవుతుందనే చేదు నిజం.. ఇదీ.. కుభీర్ మండలం సిర్పెల్లి(హెచ్) గ్రామంలోని గాడేకర్ అమ్రాజీ-జైశీల దంపతుల కూతరు సంకీర్తన ధీన స్థితి.
వీరిది తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామం. నిరుపేద కుటుంబం. కూలీ పనిచేస్తే గానీ, పూటగడవని దుస్థితి. తల్లిదండ్రులు ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా నాల్గో తరగతి దాకా గ్రామంలో, 5 నుంచి 10 వరకు టీఎస్డబ్ల్యూ ఆర్జేసీ లెఫ్ట్ పోచంపాడ్లో.., ఇంటర్ విద్య టీఎస్డబ్ల్యూ ఆర్జేసీ ఆదిలాబాద్లో అభ్యసించింది. 924 మార్కులు సాధించింది. నీట్ పరీక్ష రాసిన సంకీర్తన, హైదరాబాద్లోని మల్లారెడ్డి మహిళా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు దక్కించుకుంది. ఆన్లైన్లో కౌన్సెలింగ్ సైతం పూర్తిచేసుకున్నది. కాగా, ఏడాదికి రూ.2.50 లక్షల వరకు ఖర్చవుతుందన్న చేదు నిజాన్ని తట్టుకోలేక సతమతమవుతున్నది. నిరుపేద కుటుంబం కావడంతో డబ్బు ఎక్కడతెచ్చేదని, ఎలా చదువుకునేదని ఆవేదన చెందుతున్నది.
దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నది. సర్కారు గానీ, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ గానీ తమ కూతురి కలసాకారం చేయాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. దాతలు ముందుకురావాలని స్థానిక సర్పంచ్ రాజేందర్ కోరారు. కాగా, వైద్య విద్యనభ్యసించి మండల ప్రజలకు తనవంతు సేవచేస్తానని సంకీర్తన అంటున్నది. తన తల్లిదండ్రులు కష్టపడి ఇంతవరకు చదివించారని పేర్కొంటున్నది. ఇత్త పెద్ద మొత్తంలో డబ్బు అవసరమని చెప్పగానే వారి క్షభ రోజురోజుకూ అధికమవుతున్నదని ఆవేదన చెందుతున్నది. దాతలు అపన్నహస్తం అందించి ఆదుకోవాలని చేతులు జోడించి వేడుకుంటున్నది. తన బ్యాంక్ ఖాతా నంబర్ : 41478057957, IFSC CODE : SBIN0011084కు గానీ, ఫోన్ పే, గూగుల్ పే నంబర్ : 9505372490కు గానీ సాయం చేయాలని కోరుతున్నది.