భైంసా, నవంబర్ 28 : పాడి రైతులకు పశుగ్రాసం దొరకడం లేదు. యంత్రాలతో వరి కోస్తుండడంతో సరిగ్గా గడ్డి చేతికి అందడం లేదు. దీంతో పశుపోషణ భారంగా మారింది. కూలీలతో వరి కోయిస్తే పంట చేతికి వచ్చే సరికి పది రోజుల సమయం పడుతుంది. దీంతో రైతులు ఎక్కువగా యంత్రాలతో వరి కోయిస్తున్నారు. దీంతో ఒక్కరోజులో పంట చేతికి వస్తుంది. ఆ యంత్రాలతో పంటను కోగా వచ్చే గడ్డి పశువుల మేతకు ఉపయోగపడడం లేదు. దీంతో పాడి రైతులు పశువుల మేతకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో రైతులు సజ్జలు, ఎన్నో పంటలను విరివిగా సాగు చేసే వారు. దీంతో రైతులకు పశుగ్రాసం కొరత ఉండేది కాదు. కట్టలు కట్టే యంత్రాలు వచ్చినా వరి కోత మిషన్తో కోసే సమయంలో గడ్డి ముక్కలుగా అవుతుండడంతో చాలా వరకు వృథా అవుతుంది.
ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు
పంటను కోసేందుకు కూలీల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. ఒకవేళ కూలీలున్నా ఎక్కువ మొత్తం డబ్బులు చెల్లించాల్సి వస్తుందన్న భావనకు తోడు తక్కువ సమయంలో పనిపూర్తవుతుందని రైతులు యంత్రాలను ఆశ్రయిస్తున్నారు. యంత్రాల వాడకంతో గడ్డి చేతికి అందడం లేదు. నిల్వ చేయడం ఇబ్బందిగా మారిందని రైతులు పేర్కొంటున్నారు. పశుగ్రాసం లేక రైతులు ఇతర ప్రాంతాల నుంచి ట్రాక్టర్ గడ్డికి రూ. 10 వేల నుంచి రూ. 12 వేలకు కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నారు.
బక్కచిక్కుతున్న పశువులు
ఏటేటా పశుగ్రాసం కొరతతో పశువులు బక్క చిక్కుతున్నాయి. గతంలో రైతులు చిరుధాన్యాలైన సజ్జ, జొన్న, కొర్ర వంటి పంటలను సాగు చేసేవారు. వీటి నుంచి పెద్ద మొత్తం పశుగ్రాసం లభించేంది. దీనికి తోడు ఏ గ్రామంలో చూసినా బీడు భూములు అధిక విస్తీర్ణంలో ఉండేవి. పశువులకు పత్తి మేత కూడా విరివిగా లభించేది. ప్రస్తుతం వ్యవసాయంలో వస్తున్న శాస్త్ర సాంకేతికతతో భూములకు డిమాండ్ పెరగడం, సాగునీటి వనరులు పెరగడంతో బీడు భూములు మచ్చుకైనా కనిపించడం లే. ఇది కూడా పశుగ్రాసం కొరతకు ఒక కారణంగా చెప్పుకోవచ్చు.
పశుగ్రాసం దొరుకుత లేదు
పశుగ్రాసం కొరతతో పశువులను అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తున్నది. వరి సాగు చేసినా ప్రకృతి వైపరీత్యాలతో పంట చేతికి వచ్చేదాకా నమ్మకం లేకుండా పోయింది. సొంత పొలాలున్నా పశువులకు గడ్డి సరిపోవడం లేదు.
శ్రీనివాస్, రైతు