ఉట్నూర్ రూరల్, నవంబర్ 28: ఆదివాసీ గూడేలకు గుర్తింపునిచ్చింది తెలంగాణ ప్రభుత్వమేనని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండలంలోని హీరాపూర్(జే) గ్రామంలో సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం జడ్పీ నిధులతో బోర్వెల్ వేయించారు. గ్రామంలో హనుమాన్ మందిర నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమై మాట్లాడారు. ఆదివాసీల అభ్యున్నతి టీఆర్ఎస్(బీఆర్ఎస్) ప్రభుత్వంతోనే సాధ్యమని చెప్పారు. గూడేలను పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత టీఆర్ఎస్(బీఆర్ఎస్) ప్రభుత్వానిదేనని అన్నారు. గ్రామానికి అటవీ శాఖ అనుమతులు రాగానే రోడ్డు, గ్రామ సమస్యలను పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. మిషన్ భగీరథ నీరు సక్రమంగా రావడంలేదని తెలుపగా మిషన్ భగీరథ ఎస్సీకి ఫోన్ చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం చైర్మన్ను గ్రామస్తులు సన్మానించారు. సర్పంచ్ కుడ్మెత రాధ, ఎంపీటీసీ లచ్చు, జిల్లా జీవ వైవిధ్య మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు మర్సుకోల తిరుపతి, మాజీ ఎంపీటీసీ సలీమ్ పాల్గొన్నారు.