ఖానాపూర్ టౌన్, నవంబర్ 25: అంతర పంటలతో మరింత ఆదాయం పొందవచ్చని వ్యవసాయశాఖాధికారులు చెబుతున్నారు. వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలిస్తుండడంతో ఆశించిన దిగుబడులు వస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తుండడంతో కంది సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు.
ఖానాపూర్, కడెం, పెంబి, దస్తురాబాద్ మండలాల రైతులు పసుపు, పతి, వరి పంటల్లో అంతర పంటగా కంది సాగుచేస్తున్నారు. ఇప్పటి వరకు కంది పంటకు అనుకూలంగానే ఉండడంతో పంట దిగుబడులు ఆశించిన విధంగా వస్తాయని రైతులు పేర్కొంటున్నారు. వర్షాలు సమృద్ధిగా కురువడంతో అంతర సాగుకు కంది పంట సహకరిస్తుందని రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం కంది పంట పూత, కాత దశలో ఉంది. ప్రకృతి సమతుల్యంగా ఉంటేనే ఈ పంట దిగుబడి అనుకున్నంతగా వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. ఈ సమయంలో వర్షాలు కురిస్తే చాలా నష్టం జరిగే ప్రమాదం ఉంటుందని పేర్కొంటున్నారు.
ఖానాపూర్, పెంబి, కడెం, దస్తురాబాద్ మండలాల్లో గిరిజనుల ప్రధాన పంటగా వేసే పత్తిలో కంది(తొగరు)ని అంతర పంటగా సాగు చేస్తున్నారు. పసుపు, వరి మధ్యలో సైతం కందిని సాగు చేస్తున్నారు. ఈ నాలుగు మండలాల్లో సుమారు 4800 ఎకరాల్లో అపరాలను సాగు చేయగా అందులో కంది 1600ల ఎకరాల వరకు సాగుచేస్తున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పంటను కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అంత వరకు ప్రకృతి సహకరించాలని రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం నాలుగు మండలాల్లో కంది పంట ఆశాజనకంగానే ఉందని రైతులు చెబుతున్నారు. వ్యవసాయ పెట్టుబడులకు అనువుగా ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించాలని కోరుతున్నారు.
రైతులకు లాభదాయకం
ఖానాపూర్ సబ్ డివిజన్ పరిధిలో రైతులు పసుపు, వరి పంట మధ్యలో అంతర పంటగా కంది సాగు చేస్తున్నారు. అంతర పంటలతో రైతుకు ఎంతో ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. అంతర పంటలకు తెగు ళ్లు సోకకుండా సస్యరక్షణ చర్యలు తగిన మోతాదులో చేపట్టాలి. పంటను ఆరోగ్యంగా ఉంచే విధంగా రైతులు శ్రద్ధ తీసుకుంటే దిగుబడి ఆశించిన విధం గా వస్తుంది. వాతావరణం సమతుల్యంగా లేనప్పుడు మాత్రం పూతరాలే ప్రమాదం ఉంటుంది. చిరుధాన్యాలు, ఆరుతడి, అంతర పంటలు సాగుచేసే లా ప్రోత్సహిస్తూ రైతులకు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. కంది సాగులో ఏ సమస్య ఉన్నా వ్యవసాయ శాఖ కార్యాలయంలో సంప్రదించాలి.
–ఆసం రవి, ఏవో, ఖానాపూర్ మండలం