ఆడపిల్ల.. ప్రతి ఇంటికీ వెలుగు.. ప్రేమ ఆప్యాయతలకు చిరునామా.. అలాంటి ఆ బిడ్డపై ఏళ్లకేళ్లు వివక్ష కొనసాగింది. ఆధునిక సమాజం కూడా ఆడామగా తేడా చెరిపేయలేకపోయింది. ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాలతో ఆడపిల్లలు, తల్లిదండ్రుల్లో ధీమా పెంచుతున్నది. ఆడపిల్ల పుట్టిందా.. అనే దీన పరిస్థితి నుంచి ‘ఆకాశమే హద్దుగా ముందుకు సాగుతున్న అతివ’ అని చెప్పుకునేంతగా మార్పు వచ్చింది. ఆదిలాబాద్ జిల్లాలో ఆడపిల్లల జననరేటు ఇందుకు నిదర్శంగా చెప్పవచ్చు. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి వెయ్యి మంది మగపిల్లలకు 931 మంది బాలికలు ఉండగా, కొత్తగా విడుదలైన జాతీయ ఆరోగ్య సమాచారం మేరకు ఆ సంఖ్య 958కి చేరింది. లింగవివక్షను రూపుమాపేందుకు ఇదొక మంచి అవకాశమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
ఆదిలాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): గతంలో ఆడపిల్లంటే భారం. మరో ఇంట్లో దీపం పెడుతుందనే భావన చాలా మందిలో ఉండేది. రెండోసారి కూడా పుడితే ‘మళ్లీ ఆడపిల్లనేనా’ అని అనుకునే పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లో మార్పు వచ్చింది. ఆడ, మగ ఎవరైనా ఓకే అనేలా పరిస్థితి మారుతున్నది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇలాంటి సమస్యకు పరి ష్కారం చూపింది. ఆడపిల్ల పుట్టింది మొదలుకొని ఉద్యోగం సాధించేంత వరకు ప్రభుత్వం అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తున్నది. దీంతో ఆడా, మగ అనే వ్యత్యాసం చాలా వరకు తగ్గింది. అమ్మా యిలను కూడా ఉన్నంతలో ఉన్నతస్థాయిలో చదివి స్తున్నారు. ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, అమ్మఒడి, కేసీఆర్ కిట్ లాంటి పథకాలు అమలు చేస్తున్నది. బాలికల కోసం ప్రత్యేకించి రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసి ఐదో తరగతి నుంచి డిగ్రీ వరకు ఉచితంగా విద్యను అందిస్తున్నది. ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా వారికి రిజర్వేషన్లను పెంచింది. సమాజంలో అమ్మాయిల రక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. షీం టీంలను ఏర్పాటు చేసి వారికి భరోసా కల్పిస్తున్నది. వేధింపులు, హింసకు గురైన వారిని అక్కున చేర్చుకునేందుకు సఖీ కేంద్రాలను ఏర్పాటు చేసి, అవసరమైన సాయం అందిస్తున్నది.
పెరిగిన జనన రేటు
ఆదిలాబాద్ జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం వేయి మంది మగ పిల్లలకు 931 మంది ఆడ పిల్లలు ఉండేవారు. జాతీయ ఆరోగ్య సమాచారం కింద నమోదైన 2020-21 గణాంకాల ప్రకారం జిల్లాలో ప్రతి వేయి మంది అబ్బాయిలకు 958 మంది అమ్మాయిలు ఉన్నారు. పదేళ్లలో జిల్లాలో ఆడ పిల్లల జనన రేటు 2.7 శాతం పెరిగింది. గతంలో అమ్మాయిలను బడికి పంపాలంటే భయపడే తల్లి దండ్రులు ఇప్పుడు నిర్భయంగా స్కూల్కు పంపుతు న్నారు. దీంతో జిల్లాలో బాలికల అక్షరాస్యత శాతం పెరిగింది. జిల్లాలోని బీసీ, ఎస్సీ, మైనార్టీ, గిరిజన గురుకుల పాఠశాలల్లో అమ్మాయిలకు ప్రభు త్వం ఇంగ్లిష్ మీడియంతో పాటు పౌష్టికాహారం అందిస్తున్నది. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖ లు, ఉపాధ్యాయులు, పోలీస్, అటవీ శాఖల్లో మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంద్రవెల్లికి చెందిన అఫ్రీనా ఇరానీ ఓ ప్రైవేట్ ఎయిర్లైన్స్లో పైలట్గా పనిచేస్తున్నారు. ప్రభుత్వ సాయం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అమ్మాయిలు వివిధ రంగాల్లో అబ్బాయిలతో పోటీ పడుతున్నారు. పుట్టింది ఎవరైనా ఒకే అని ప్రస్తుతం తల్లిదండ్రులు భావిస్తుండడం శుభపరిణామం కాగా, రానున్న రోజుల్లో ఆడపిల్లల జనన రేటు మరింతగా పెరిగే అవకాశం ఉంది.
అమ్మాయిల చదువుపై శ్రద్ధ..
ప్రభుత్వ ఉపాధ్యాయుడు సాయిరి శ్రీకాంత్, మంజుల(గృహిణి) దంపతులు తమ ఏకైక కూతురు శ్రీలాస్యను పదోతరగతి వరకు సర్కారు బడిలోనే చదివించారు. ప్రస్తుతం శ్రీలాస్య ఇంటర్ (బైపీసీ) మొదటి సంవత్సరం చదువుతున్నది. శ్రీకాంత్ ఏ పాఠశాలలో పనిచేసినా అక్కడ పేదరికం, నిస్సహాయ పరిస్థితిలో ఉండే ఆడపిల్లల చదువులకు తన జీతం నుంచే కొంత మొత్తం డిపా జిట్ చేస్తారు. ఆడపిల్ల చదువులకు ప్రత్యేక శ్రద్ధ్ద తీసుకుంటారు. గ్రామంలో చదువు తరువాత తలిదండ్రులను ఒప్పించి వారిని కస్తూర్బాలో చేర్చుతున్నారు. ఉన్నత విద్యకు ప్రోత్సహిస్తున్నా రు. ప్రస్తుతం పాపైనా ,బాబు అయినా సామా న్యులు, విద్యావంతులు సమభావనతో ఉన్నారని, కొన్ని సర్కారు పథకాలతో ఆడపిల్ల చదువులకు వెలుగు వచ్చిందని చెబుతున్నారు ఉపాధ్యాయుడు శ్రీకాంత్. తమ ఒక్క కూతురిని ఉన్నతంగా చదివించి ప్రయోజకురాలిగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఉన్నామని పేర్కొన్నారు.
– సాయిరి శ్రీకాంత్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు ,అంతర్గాం ,భీంపూర్ మండలం
ఆడపిల్ల పుడితే సంతోషిస్తున్నారు
గతంలో ఆడపిల్లలపై వివక్షకు కారణాలు అనేకం. ప్రస్తుతం ఆడపిల్ల పుడితే బాలింత ముఖంలో చిరునవ్వు .. మేము గమనిస్తున్నాం. దీనికీ కారణాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బాలికా సంరక్షణ, స్త్రీ శిశుసంక్షేమానికి అనేకానేక కార్యక్రమాలు అమలు చేస్తున్నది. గ్రామాల్లో వీరికి పౌష్ట్టికాహారంతో పాటు వైద్యం అందిస్తున్నది. ఆడపిల్ల పుడితే కేసీఆర్ కిట్, నగదు పారితోషికం అందిస్తున్నది. ఏడెనిమిదేళ్లుగా బాలికా విద్య ప్రాధాన్యతాంశంగా మారింది. ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెరిగాయి. ప్రధానంగా ప్రభుత్వం లింగనిర్ధారణ పరీక్షలపై ఉక్కుపాదం మోపడం కూడా సత్ఫలితాలనిచ్చింది. రానున్న రోజుల్లో ఆడపిల్లలే అన్ని రంగాల్లో టాప్లో ఉంటారు.
-డాక్టర్ వీ కౌస్తుభా విజయసారథి , గైనకాలజిస్ట్,రిమ్స్
ఇద్దరు ఆడపిల్లలను అదృష్టంగా భావిస్తున్నాం..
మాకు ఇద్దరు ఆడపిల్లలు. నేను, నా భార్య రమాదేవి ఇద్దరం ప్రభుత్వ ఉపాధ్యాయులం. నా పెద్ద కూతురు సింధు హైదరాబాద్లోని ప్రైవేట్ కళాశాలలో బీటెక్ చదువుతుంది. చిన్న కూతరు సిరి హైదరాబాద్లోఇంటర్ ఫస్టియర్ చదువుతున్నది. నాకు మగపిల్లలు లేరు అని ఏ రోజు అనుకోలేదు. వారిద్దరిని మగపిల్లలుగానే చూస్తున్నం. వారికి ఏమీ తక్కువ కాకుండా చూసుకుంటున్నాం. మగపిల్లల లాగే వారికి కరాటే, స్విమ్మింగ్, డాన్స్ నేర్పించాను. ఉన్నత చదువులు చదివిస్తాను. వారి కోరుకుంటే ఉన్నత విద్యకోసం విదేశాలకు పంపడానికి సిద్ధంగా ఉన్నాను. మాఇంట్లో ఏ నిర్ణయం తీసుకున్నా వారి సలహాలు తీసుకుంటాం.. వారు కూడా మాకు సలహాలు ఇస్తారు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టడం మా ఆదృష్టంగా భావిస్తున్నాం.
-నర్ర నవీన్ యాదవ్ , ఉపాధ్యాయుడు ఆదిలాబాద్