నిర్మల్ అర్బన్, నవంబర్ 5 : రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్లు వెలువరిస్తున్నదని, జిల్లా అభ్యర్థులు పెద్దసంఖ్యలో ఉద్యోగాలు సాధించాలన్న సంకల్పంతో ముందుకు సాగాలని రాష్ట్ర దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. అల్లోల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు శారీరదారుఢ్య శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఆ శిక్షణ కేం ద్రాన్ని సందర్శించారు. అభ్యర్థులతో మాట్లాడా రు. అభ్యర్థుల ఆర్థిక ఇబ్బందులు, వ్యయప్రయాసలను దృష్టిలో ఉంచుకొని లక్షలాది రూపాయ ల ఖర్చును ట్రస్ట్ భరిస్తున్నదని చెప్పారు.
అల్లోల ట్రస్ట్ ఆధ్వర్యంలో అనుభవజ్ఞులైన అధ్యాపకులతో, ఉచిత స్టడీ మెటీరియల్ ద్వారా ప్రిలిమ్స్ లో 150 మంది ఉత్తీర్ణులవడం చాలా సంతోషం గా ఉందన్నారు. రానున్న పరీక్షల్లో అభ్యర్థులం తా ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం వెలువరించే అన్ని పోటీ పరీక్షలకు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నామన్నారు. అనంతరం పట్టణంలోని గాజుల్పేట్లో నూతనంగా నిర్మించిన అంబేద్కర్ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చాణక్య కళాశాల ప్రిన్సిపాల్ బర్ల జనార్దన్ రెడ్డి, నర్సారెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, మారుగొండ రాము, ముడుసు సత్యనారాయణ, ఆయా వార్డుల కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.