బాసర, ఫిబ్రవరి 5 : వసంత పంచమి సందర్భంగా చదువుల తల్లి బాసర సరస్వతీ అమ్మవారి క్షేత్రం శనివారం భక్తజనసంద్రంమైంది. వేకువజామున మూడు గంటల నుంచే అమ్మవారి దర్శనంతోపాటు చిన్నారుల అక్షరాభ్యాసాల కోసం క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. తెలుగు రాష్ర్టాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి సైతం భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులు ముందుగా గోదావరి నదిలో స్నానమాచరించి అమ్మవారి దర్శనానికి బయలుదేరారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ, ధర్మాదాయ, అటవీ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి దంపతులు ఎమ్మెల్యే విఠల్రెడ్డి, ఎమ్మెల్సీ దండె విఠల్తో కలిసి అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి పట్టువస్ర్తాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ శరత్పాఠక్ వీరికి అమ్మవారి ప్రతిమను అందజేశారు. ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు.
బాసరకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సీఐ వినోద్రెడ్డి, బాసర ఎస్ఐ మహేశ్, మరో ఆరుగురు ఎస్ఐలు, దాదాపు 400 మంది పోలీసు సిబ్బంది ఎప్పటికప్పుడు ట్రాఫిక్ నియంత్రణ చేశారు.
బాసర ఆలయంలో అధికారులతోపాటు బాసర గ్రామస్తులు, పలు సేవా సమితి సభ్యులు క్యూలైన్లలోని పిల్లలకు, భక్తులకు తాగునీరు, పాలు, బిస్కెట్లు అందజేశారు. ఆలయం వద్ద ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
అమ్మవారి జన్మదినం వసంత పంచమి సందర్భంగా ఆలయంలో రూ. 1000 అక్షరాభ్యాసాలు 2,700, రూ.100 అక్షరాభ్యాసాలు 1900 మొ త్తం అక్షరాభ్యాసాలు 4,600 జరిగాయి. ఆర్జిత సేవలు, ప్రసాదాల విక్రయాల ద్వారా అమ్మవారికి రూ.51 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వినోద్రెడ్డి తెలిపారు. సుమారు 80వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు.