ఆదిలాబాద్, ఫిబ్రవరి 3 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ జిల్లాలో వేలాది మందికి ఉపాధి కల్పించే ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. సీసీఐని పునరుద్ధరించడానికి అవకాశాలున్నా ఢిల్లీలోని బీజేపీ సర్కారు మాత్రం పట్టించుకోవడం లేదు. పరిశ్రమకు అవసరమైన స్థలం, ముడిసరుకు అందుబాటులో ఉందని, ప్రస్తుతం సిమెంట్కు ఉన్న డిమాండ్ నేపథ్యంలో పరిశ్రమను తిరిగి ప్రారంభిస్తే లాభాలు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు. సీసీఐని ప్రారంభిస్తే జిల్లాలోని వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. పరిశ్రమ మూతపడడంతో భూములు కోల్పోయిన వారికి సైతం ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఏడు సంవత్సరాలుగా ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని ప్రారంభించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతూ వస్తున్నది. గతంలో సీసీఐని సందర్శించిన కేంద్ర మంత్రులు.. పరిశ్రమను ప్రారంభిస్తామని ప్రజలకు ఆశలు కల్పించారు. పరిశ్రమ పునరుద్ధరణ కోసం రాయితీలు వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్ర మంత్రులు, జిల్లాలోని ప్రజాప్రతినిధులు పలుమార్లు కేంద్ర మం త్రులను కలిసి వినతిపత్రాలు అందజేసినా పట్టిం చుకోవడం లేదు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సైతం సీసీఐ విషయంలో కేంద్రానికి లేఖలు రాసినా బీజేపీ సర్కారు నుంచి స్పందన కరువైంది.
సీసీఐ విషయంలో కేంద్రం తీరును నిరసిస్తూ అఖిలపక్షం నాయకులు, ప్రజా సంఘాలు, భూ నిర్వాసితులు సీసీఐ సాధన కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. వివిధ రూపాల్లో నిరసనలు చేపట్టిన సాధన కమిటీ సభ్యులు.. కేంద్ర ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇందు లో భాగంగా ఆందోళనలు తీవ్రం చేశారు. కేంద్రం సీసీఐని తిరిగి ప్రారంభించాలంటూ నేడు(శుక్రవారం) ఆదిలాబాద్ పట్టణ బంద్కు పిలుపునిచ్చారు. ఈ నెల 10న జాతీయ రహదారులను నిర్బంధించనున్నట్లు సాధన కమిటీ సభ్యులు తెలిపారు. సీసీఐ విషయంలో కేంద్రం తీరును నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలకు ప్రజలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. వేలాది మందికి ఉపాధి కల్పించడంతో పాటు పట్ణణ అభివృద్ధికి దోహదం చేసే సీసీఐ విషయంలో కేంద్రం మొండివైఖరి వీడనాడాలని స్థానికులు కోరుతున్నారు. బంద్లో భాగంగా ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడనున్నాయి. ఆర్టీసీ బస్సులు సైతం నడిచే అవకాశాలు లేవు. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చేంత వరకూ ఆం దోళనలు కొనసాగిస్తామని సాధన కమిటీ సభ్యులు స్పష్టంచేశారు.