ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తీవ్రస్థాయికి చేరుకుంది. డీసీసీ అధ్యక్షుడు సాజిద్ఖాన్, బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన కంది శ్రీనివాస్రెడ్డిల మధ్య వర్గ విభేదాలు ఉన్నాయి. ఈ విభేదాలు సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ బీసీ ఐక్యవేదిక సమావేశంలో భగ్గుమన్నాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీహెచ్ హన్మంతరావు హాజరు కాగా.. ఆయన ముందే ఇరువర్గాల నాయకులు, కార్యకర్తలు బల ప్రదర్శనకు దిగారు. బీజేపీ నుంచి వచ్చిన ఆయనకు ఆర్ఎస్ఎస్ భావాలు ఉన్నాయని, అలాంటి వారికి పార్టీ టికెట్ ఇచ్చే అవకాశాలు లేవని జిల్లా నేతలు ప్రకటించారు. పార్టీలో గందరగోళం సృష్టిస్తున్న శ్రీనివాస్రెడ్డిని ఆరు నెలలపాటు సస్పెండ్ చేస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు సాజిద్ఖాన్ ప్రకటించారు.
– ఆదిలాబాద్, ఆగస్టు 14(నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్, ఆగస్టు 14(నమస్తే తెలంగాణ) ః ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో కొన్ని రోజులుగా రగులుతున్న అంతర్గత విభేదాలు సోమవారం నిర్వహించిన బీసీ ఐక్యవేదిక సమావేశంలో భగ్గుమన్నాయి. ఈ సమావేశానికి కాంగ్రెస్ సీనియ ర్ నేత వీహెచ్ హన్మంతరావు, ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ఖాన్, టీ పీసీసీ ప్రధాన కార్యదర్శి సుజాత, ఇతర నాయకులు, పార్టీ జడ్పీటీసీలు హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన కంది శ్రీనివాస్రెడ్డి తన అనుచరులు, బౌన్సర్లతో కలిసి సమావేశానికి వచ్చారు. బయట కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు గేటు బయట అడ్డుకునే ప్రయత్నం చేయగా.. అనుచరుల సాయంతో సమావేశ హాలులోకి వచ్చారు. ఆయన సమావేశానికి రావడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. శ్రీనివాస్రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన సమావేశం నుంచి వెళ్లిపోవాలని నిరసన చేపట్టారు. శ్రీనివాస్రెడ్డి వర్గీయుల కూడా నినాదాలు చేయడంతో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. జిల్లా కాంగ్రెస్లో వర్గపోరు కొన్ని రోజులుగా నడుస్తోంది. పార్టీ కార్యక్రమాలను డీసీసీ అధ్యక్షుడు సాజిద్ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా.. వీటికి శ్రీనివాస్రెడ్డి హాజరుకావడం లేదు. బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన శ్రీనివాస్రెడ్డిని ప్యారాచూట్ నాయకునిగా కాంగ్రెస్ నేతలు అభివర్ణిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ భావాలు ఉన్న ఆయనకు శాసనసభ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇచ్చే అవకాశాలు లేవని నాయకులు అంటున్నారు.
కంది శ్రీనివాస్రెడ్డిపై జిల్లా కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు పార్టీ అధిష్ఠానం టికెట్ ఇస్తున్నట్లు హామీ వచ్చిందని ఆయన గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఆయన నిర్వహించే ఏ కార్యక్రమానికి తమను పిలవడం లేదని, విలేకరులు అడిగిన ప్రశ్నలకు తమను కించపర్చే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు. రాష్ట్రస్థాయిలో పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు తాను ఆర్థికంగా సాయం చేస్తున్నట్లు అంటున్నారని, డబ్బు ఉందనే అహంకారంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని జిల్లా కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. డీసీసీ అధ్యక్షుడు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, డీసీసీ మాజీ అధ్యక్షుడు భార్గవ్ దేశ్పాండే, ఇతర నాయకులు శ్రీనివాస్రెడ్డి వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ తాను తీసుకున్న నిర్ణయాన్ని అధిష్టానం ఆమోదించకపోతే తాను గుడ్బై చెప్పాల్సి వస్తుందని డీసీసీ అధ్యక్షుడు సాజిద్ఖాన్ అనడం పార్టీలోని అంతర్గత పోరును ఏ విధంగా ఉందనేదానికి నిదర్శనంగా చెప్పవచ్చు.