ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఈ యేడాది యాసంగిలో ప్రాజెక్టుల కింద సాగు నీటి భూములకు సరిపడా నీరుఅందనున్నది. రెండు జిల్లాల్లో ప్రాజెక్టుల కింద ఉన్న 1.04 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వానకాలంలో కురిసిన వర్షాల కారణంగా ప్రాజెక్టుల్లోకి నీరు పుష్కలంగా చేరింది. వానకాలం పంటలు చివరి దశకు చేరుకోగా.. యాసంగి పంటలకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఈ సీజన్లో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో వరి, శనగ, ఆరుతడి పంటలు వేయనున్నారు. వారబందీ విధానంలో అధికారులు ప్రాజెక్టుల నుంచి కాలువల ద్వారా సాగు నీటిని విడుదల చేయనున్నారు.
– ఆదిలాబాద్, నవంబర్ 22(నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్, నవంబర్ 22 ( నమస్తే తెలంగాణ) : జిల్లాలో గతంలో సాగునీటి కొరత కా రణంగా రైతులు వర్షాధార పంటలు సాగు చేసేవారు. సాగునీటి ప్రాజెక్టులు ఉన్న నిర్వహణ లేకపోవడంతో సాగునీరు అందేది కాదు. అ యితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం సాగునీటి రంగానికి పెద్దపీట వేసింది. ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు మరమ్మతులు, కాలువల ఆధునీకీకరణ, మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చెరువులను బాగు చేసింది. దీంతో రైతులకు రెండు పంటలకూ సరిపడా సాగునీరు అందుతున్న ది. ప్ర భుత్వం తీసుకుంటున్న చర్యలతో ఆదిలాబా ద్, నిర్మల్ జిల్లాల్లో ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. గతంలో సాగునీరు లేకపోవడంతో ఒక పంట వేయాలంటే భయపడే రైతు లు ఇప్పుడు రెండు సీజన్లలో పంటలు సాగు చేస్తున్నారు. అధికారులు సైతం సకాలంలో ప్రాజెక్టుల నుంచి సాగునీటిని సరఫరా చేస్తున్నారు.
1.04 లక్షల ఎకరాలకు సాగునీరు
ఈ ఏడాది వానకాలంలో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా సాగునీటి ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు చేరింది. రెండు జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. నిర్మల్ జిల్లా కడెం, స్వర్ణ, గడ్డెన్న వాగు, ఆదిలాబాద్ జిల్లా సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్టులు గరిష్ట నీటిమట్టానికి చేరుకున్నారు. ప్రాజెక్టు కింద ఆయకట్టుకు వానకాలం పంటలకు రైతులకు నీటిని వదిలారు. ప్రస్తుతం సీజన్ చివరిదశకు చేరుకోవడంతో రైతులు యాసంగికి సన్నద్ధమవుతున్నారు.
ఈ సీజన్లో రైతులు నిర్మల్ జిల్లాలో వరి, మక్క, ఆదిలాబాద్ జిల్లాలో శనగ, గో ధుమ పంటలను ఎక్కువ సాగు చేస్తారు. వీటి తో పాటు రెండు జిల్లాల్లో ఆరుతడి పంటలను సైతం వేస్తారు. ప్రాజెక్టుల్లో నీరు పుష్కలంగా ఉండడంతో సరఫరా చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. రెండు జిల్లాల్లో 1. 04 లక్షల ఎకరాలకు ప్రాజెక్టుల ద్వారా సాగునీటిని విడుదల చేయనున్నారు. యాసంగిలో నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు కింద 35 వేల ఎకరాలు, ఎస్సారెస్పీ ద్వారా 30 వేల ఎకరాలు, గడ్డెన్న వాగు ప్రాజెక్టు కింద 8 వేలు, స్వర్ణ ప్రా జెక్టు కింద 7 వేలు, ఆదిలాబాద్ జిల్లా సా త్నాల ప్రాజెక్టు కింద 18 వేలు, మత్తడివాగు ప్రాజెక్టు కింద 6 వేల ఎకరాలను సాగునీటిని అందించనున్నారు. మూడు నెలల పాటు వారబంధీ విధానంలో పంటలకు నీటిని అందించనున్నారు. యాసంగి పంటలకు సాగునీరు లభిస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వారబంధీ విధానంలోనీటి విడుదల
ఆదిలాబాద్ జిల్లాలో సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్టుల్లో యాసంగి పంటలకు సరిపడా నీరు నిల్వ ఉంది. జిల్లాలో ఎక్కువగా రైతులు శనగ పంటను సాగు చేస్తారు. సాత్నాల ప్రాజెక్టు ద్వారా 18 వేలు, మత్తడి వాగు కింద 6 వేల ఎకరాల పంటలు సాగవుతాయని అంచనా వేశాం. రెండు ప్రాజెక్టుల ఆయకట్టుకు వారబంధీ పద్ధతిలో కాలువ ద్వారా నీటిని విడుదల చేస్తాం. రైతులకు సాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం.
– రాథోడ్ విఠల్, ఈఈ, నీటిపారుదల శాఖ, ఆదిలాబాద్