ఎదులాపురం, జనవరి 9 : ప్రజావాణిలో వచ్చిన అర్జీలు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి లో భాగంగా అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్తో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పింఛన్లు, వైద్యం, భూ సంబంధిత, ఉపాధి, ధరణి, దళిత బంధు, రెండు పడక గదుల ఇండ్ల మంజూరు తదితర సమస్యలపై దరఖాస్తులు అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. శాఖల వారీగా వచ్చి న అర్జీలను సంబంధిత అధికారులు పరిశీలించాలని సూచించారు. వాటి పరిష్కారానికి కృషి చే యాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమేశ్ రాథోడ్, డీఆర్డీవో కిషన్, మున్సిపల్ కమిషనర్ శైలజ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ
ఆదిలాబాద్ టౌన్, జనవరి 9 : తెలంగాణ వ్యవసాయ శాఖ అధికారుల సంఘం క్యాలెండర్, డైరీని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సోమవారం ఆవిష్కరించారు. వ్యవసాయ శాఖాధికారులకు తమ విధుల నిర్వహణలో భాగంగా డైరీ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు అశ్రఫ్ అహ్మద్, జనరల్ సెక్రటరీ శివకుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య, ట్రెజరర్ వివేక్, అధికారులు రమేశ్, రవీందర్, ప్రమోద్ రెడ్డి, విశ్వామిత్ర, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
నేడు కంటి వెలుగుపై అవగాహన సదస్సు
ఎదులాపురం, జనవరి 9 : కంటి వెలుగు కా ర్యక్రమంపై మంగళవారం రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అవగాహన సదస్సు నిర్వహించనున్నారని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ తెలిపారు. ఈ సదస్సుకు జిల్లాలోని ఆయా శాఖల అధికారులతో పాటు జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, మండల, జిల్లా ప్రత్యేకాధికారులు, మెడికల్ ఆఫీసర్లు, సంబంధిత శాఖల అధికారులు సకాలంలో హాజరుకావాలని కోరారు.