ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో బీఆర్ఎస్ ప్రచారం అలుపెరగకుండా సాగుతున్నది. అభ్యర్థులు జోగు రామన్న, అనిల్ జాదవ్, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, విఠల్రెడ్డి, జాన్సన్ నాయక్తో పాటు శ్రేణులు.. కుటుంబ సభ్యులు జెండాలు చేతబూని విస్తృతంగా పర్యటిస్తుండగా, వాడలన్నీ గులాబీమయమవు తున్నాయి.
ఇంటింటికీ వెళ్లి అభివృద్ధితో పాటు మ్యానిఫెస్టో గురించి వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తుండగా, అనూహ్య స్పందన వస్తున్నది. మరోసారి సంక్షేమ సర్కారుకే జై కొడుతామంటూ స్పష్టం చేస్తున్నారు. ఇక ఆయా పార్టీల నుంచి వలసలు కొనసాగుతుండగా, రోజు రోజుకూ కారుకు మద్దతు పెరుగుతున్నది.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఆదివారం బీఆర్ఎస్ అభ్యర్థులు జోగు రామన్న, అనిల్ జాదవ్, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, విఠల్రెడ్డి, జాన్సన్ నాయక్తో పాటు వారి కుటుంబ సభ్యులు, శ్రేణులు జోరుగా ప్రచారం నిర్వహించారు. పల్లెలు, పట్టణాల్లో విస్తృతంగా పర్యటించగా, ప్రజలు ఘన స్వాగతం పలికారు. సభలు, సమావేశాలు నిర్వహించడమేగాక రోడ్షోలు నిర్వహించారు.
ప్రభుత్వ పథకాలు, మ్యానిఫెస్టో గురించి వివరించి ఓట్లు అభ్యర్థించారు. సమైక్య పాలనలో ఎట్లున్న తెలంగాణ.. ఇప్పుడు ఎట్లయ్యిందో గుర్తించాలని, మోసపోతే గోసపడుతామని, ఆలోచించి మరోసారి బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఇక పలుచోట్ల ఆయా పార్టీల కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు.