కరోనా కట్టడికి సర్కారు ఇంటింటికీ వైద్య బృందాలను పంపించి ఆరోగ్య సర్వే నిర్వహిస్తున్నది. ప్రతి వెయ్యి మంది జనాభాకు ముగ్గురు సభ్యుల చొప్పున 250 ఇండ్లను సర్వే చేస్తున్నారు. ఈ బృందంలో ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు, పంచాయతీ, రెవెన్యూ, అంగన్వాడీ కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది సభ్యులుగా ఉన్నారు. వివరాలు సేకరించి కొవిడ్ లక్షణాలు ఉంటే అక్కడికక్కడే హోం ఐసొలేషన్ కిట్లు అందజేస్తున్నారు. వారం పాటు జ్వరం తగ్గకపోతే సమీపంలోని కొవిడ్ కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడుతుందని సర్కారు భావిస్తున్నది.
అక్కడికక్కడే మందుల పంపిణీ
సర్వే సభ్యులు ప్రతి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటున్నారు. వారి ఆరోగ్య వివరాలు నమోదు చేస్తున్నారు. దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలు ఉంటే కరోనా కిట్ ఇస్తున్నారు. ఇందులో ఐదు మాస్కులు, 250 ఎంఎల్ శానిటైజర్, ఒక సబ్బు, రెండు జతల గ్లౌజ్లతోపాటు అజిత్రోమైసిన్ 500 ఎంజీ ట్యాబ్లెట్లు, విటమిన్ -సీ, జింకోవిట్, డోలో-650, సిట్రిజన్ హెచ్సీ క్యూ 200 ఎంజీ ట్యాబ్లెట్లు ఉంటాయి. ఆక్సీమీటర్ ద్వారా కూడా పరీక్షిస్తున్నారు. తగ్గకుంటే వారిని సమీపంలోని కొవిడ్ సెంటర్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఐసొలేషన్లో ఉన్నవారిని సదరు బృందం సభ్యులు రోజూ మానిటరింగ్ చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో దాదాపు ఏడు మండలాల్లో సర్వే పూర్తయ్యిందని సభ్యులు తెలిపారు.
సర్వేకు అన్ని విధాలా సహకరిస్తున్నారు..
ప్రజలందరూ సర్వేకు సహకరి స్తున్నారు. లక్ష ణాలు ఉన్న వా రు నిర్భయంగా చెబుతున్నారు. మండలంలో ఇప్పటివరకు ఐదు వేల మందికి కరోనా టెస్టులు చేసినం. ప్రస్తుతం మండలంలో కరోనా ప్రభా వం తగ్గుముఖం పట్టింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం.
సర్వే వల్ల జబ్బులు తెలిసిపోతాయి..
కేసీఆర్ చల్లంగా ఉండాలే. ఇప్పటికే చేతకాని వాళ్లకు పింఛన్ ఇస్తున్నడు. ఇప్పుడేమో సర్వే చేసి ఆరోగ్యం మంచిగా లేనోళ్లకు ఉచితంగానే మందులు ఇస్తున్నరు. పోయిన ఏడాది కంటి జబ్బులుంటే డాక్టర్లు వచ్చి మంచిగా చూసి న్రు. కంటి చూపు లేని వారికి అద్దాలను ఇచ్చిన్రు. ఇప్పుడేమో కరోనా సమయంలో ఇంటింటికీ వచ్చి పరీక్షించి మందులిస్తు న్నరు. మా కుటుంబంలో కొడుకులు, కోడ ళ్లు, మనుమలు, మనుమరాండ్లు కలుపుకొని 14 మందిమి ఉంటం. అందరి వివరాలు రాసుకున్నారు.
– ఓజ కావేరి, వృద్ధురాలు,బొప్పారం, సోన్ మండలం