ఆసిఫాబాద్ అంబేదర్చౌక్, జనవరి 17: ఉపాధి హామీ పథకం, గ్రామ పంచాయతీలో పన్నుల వసూలు నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, ఏపీవోలతో లక్ష్యాల సాధన ప్రక్రియపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద జాబ్ కార్డు ఉండి అర్హత గల ప్రతి కూలీకి పని కల్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఉపాధి హామీ పథకం కింద ఫారం పాండ్ల నిర్మాణాలు, కమ్యూనిటీ ఆస్తుల ఏర్పాటు, నర్సరీల నిర్వహణపై అధికారులు దృష్టి సారించాలని తెలిపారు.
గ్రామపంచాయతీల పరిధిలో మార్చి 31వ తేదీలోగా నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. గ్రామపంచాయతీల కార్యదర్శులు పన్నుల వసూలు ప్రక్రియను వేగవంతం చేయాలని, ఆ దిశగా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి కుమార్ హుస్సేన్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సురేందర్, తదితరులు పాల్గొన్నారు.